వరంగల్ చౌరస్తా, డిసెంబర్ 20 : కాకతీయ మెడికల్ కళాశాల చరిత్రలో మరో అరుదైన ఘనతకు చోటు దక్కింది. రాష్ట్రంలో మూడవ ఎంఈటీఆర్సీ(మెడికల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ రీజినల్ సెంటర్) కేఎంసీలో ఏర్పాటుకాగా నేషనల్ మెడికల్ కమిషన్ కేఎంసీలో గురువారం ప్రారంభించనున్నది. దీంతో నేటి నుంచి సేవలు అందుబాటులోకి వచ్చి వైద్య, విద్యా ప్రమాణాల తీరు మెరుగుపడనున్నది.
మెడికల్ కౌన్సిల్ సభ్యులు బుధవారం కేఎంసీని సందర్శించి ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఇటీవల బృందం నిర్వహించిన తనిఖీల్లో 2017లో అప్పటి కేఎంసీ వైద్యాధికారులు ఏర్పాటుచేసిన మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్ పనితీరు, మౌలి క వసతులను పరిశీలించి ప్రాంతీయ వైద్యవిద్యా సాంకేతిక కేంద్రాన్ని ఏర్పాటుచేసేందుకు ఆమోదం తెలిపింది. నేటి నుంచి ఆరు నెలల పాటు ఈ విభాగం పనితీరును పరిశీలించి శాశ్వత అనుమతులు ఇస్తుందని కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్దాస్ తెలిపారు. విభాగానికి కేటాయించిన భవన వివరాలతో పాటు మూడేళ్ల కాలపరిమితితో నియమితులయ్యే కన్వీనర్, కో-కన్వీనర్ల సమాచారాన్ని కమిషన్కు అందజేసినట్లు తెలిపారు. వివరాలను పరిశీలించిన తదుపరి రీజనల్ సెంటర్ పరిధిలను ఏర్పాటుచేసి అందులోని కళాశాలలను ఈ కేంద్రానికి అనుసంధానం చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఈ ప్రాంతీయ కేంద్రం ద్వారా వైద్య విద్యాబోధన చేస్తున్న అధ్యాపకులకు ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులను, ఆధునిక సాంకేతికతను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు కలుగుతుందని చెప్పారు. తద్వారా విద్యాభ్యా సం సమయంలోనే వైద్యవిద్యార్థులు నూతన శాస్త్ర, సాంకేతికను అందిపుచ్చుకునే అవకాశం కలుగుతుందన్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్ పనితీరు మూలంగా ఈ కేంద్రం అందుబాటులోకి రానుందని ఆయన అన్నారు. గతంలో వైద్య బోధనా సిబ్బంది హైదరాబాద్లోని గాంధీ మెడికల్ కళాశాలలో ప్రత్యేక శిక్షణ తరగతుల్లో పాల్గొని విద్యార్థులకు నూతన సాంకేతికతను వివరించే వారని అన్నారు. ఈ కేంద్రం ఏర్పాటుతో భవిష్యత్తులో కేఎంసీ ఉన్నతస్థానంలో నిలిచేందుకు ఎంతగానో తోడ్పడుతుందన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎన్ఎంసీ బృంద సభ్యులు వర్ధన్నపేట ప్రభుత్వ వైద్యశాలను సందర్శించారు.