హనుమకొండ, ఏప్రిల్ 28 : వచ్చే నెల 5వ తేదీన మంత్రి కేటీఆర్ నగరానికి వస్తున్నారని, పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ పిలుపునిచ్చారు. శుక్రవారం బాలసముద్రంలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో పాటు హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారని తెలిపారు.
అనంతరం హనుమకొండ కేడీసీ మైదానంలో జరిగే బహిరంగ సభకు డివిజన్ల వారీగా 30వేల మందిని సమీకరణ చేయాలన్నారు. కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలు విజయవంతమయ్యాయని, సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తలను నమ్ముతానని, తన బలం, బలహీనత కార్యకర్తలేనన్నారు. రానున్న 5 నెలలు ఎంతో ముఖ్యమని, రానున్న రోజుల్లో బూత్ కమిటీ, సోషల్ మీడియా, విద్యార్థి, ఇతరత్రా కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యకర్తల మేలు కోసం త్వరలో సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
జూన్ నెలలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి మంగళవారం కార్యకర్తలకు సమయం కేటాయించినట్లు చెప్పారు. కార్పొరేటర్లు డివిజన్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలో చేపట్టే కార్యక్రమాలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని సీఎం కేసీఆర్ చెప్పారని ఈ సందర్భంగా చీఫ్ విప్ ప్రస్తావించారు. అర్హులనే దళితబంధు లబ్ధిదారులను ఎంపిక చేశామని, ఇళ్ల పట్టాలు, గృహలక్ష్మి పథకం ద్వారా రూ.3 లక్షల అర్హులకే అందిస్తామని తెలిపారు. మే నెలలో కార్మిక మాసోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. సమావేశంలో కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్, కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి పాల్గొన్నారు.