వరంగల్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర బడ్జెట్లో ఉమ్మడి ఓరుగల్లుకు అత్యధిక ప్రాధాన్యత దక్కింది. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలు మరింత వేగంగా అభివృద్ధి జరిగేలా తాజా బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయి.
2023లో జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు బడ్జెట్లో పేర్కొన్నారు. ఈ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. హైదరాబాద్లో పేదలకు ప్రభుత్వ వైద్య సేవలను అందించే ప్రక్రియలో విజయవంతమైన బస్తీ దవాఖానలను అన్ని పట్టణాల్లోనూ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. గ్రేటర్ వరంగల్ నగరంలో ఇప్పటికే వీటిని ప్రారంభించారు. దశల వారీగా ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో బస్తీ దవాఖానలు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అన్ని జిల్లాల్లో అమలు చేయనున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. దీంతో ఎక్కువ మంది పేద, మధ్య తరగతి మహిళలకు మేలు కలుగనుంది.
పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భారీగా నిధులు కేటాయించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 2 వేల చొప్పున డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి 24 వేల ఇండ్లు నిర్మించనుంది. దీంతో పాటు సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేవారికి ప్రభుత్వం రూ.3లక్షల ఆర్థిక సాయం చేయనుంది. ఇక దళితబంధు కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1100 మంది చొప్పున 13,200 కుటుంబాలకు లబ్ధి కలుగనుంది.
రైతు రుణాల మాఫీ కోసం ప్రభుత్వం తాజా బడ్జెట్లో రూ.6,385 కోట్లు కేటాయించడంపై రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. రుణమాఫీతో ఉమ్మడి జిల్లాలోని ప్రతి రైతు కుటుంబానికి మేలు జరుగనుంది.
పామాయిల్ సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయించింది. ఈ నిధులు ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ జిల్లాలో ఆయిల్ పామ్ సాగుకు మరింత ఊతమివ్వనున్నాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల ఆయిల్ పామ్ సాగుకోసం రైతులు ముందుకొచ్చారు. కొన్నిచోట్ల మొక్కలు కూడా పాతుకున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లకు కావాల్సిన అప్రోచ్ రోడ్లు, అంతర్గత రోడ్లు, కరంట్ సరఫరా, నీటి సౌకర్యాలు, గోదాములు, కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుకు బడ్జెట్లో నిధులు కేటాయించారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు పర్యావరణం, పర్యాటకం పరంగా తెలంగాణకు సరికొత్తగా మార్చాయి. సాగునీటి ప్రాజెక్టుల వద్దకు సందర్శకుల తాకిడి నానాటికీ పెరుగుతున్నది. ఈమేరకు సందర్శకులకు వసతుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా కాళేశ్వరం సర్క్యూట్లో టూరిజం అభివృద్ధికి బడ్జెట్లో రూ.750 కోట్లు కేటాయించింది.
ప్రభుత్వ యూనివర్సిటీల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో రెండో పెద్దదైన కాకతీయ యూనివర్సిటీకి గణనీయంగా నిధులు రానున్నాయి. ఈ నిధులతో కొత్త భవనాలు, ఇతర వసతులు సమకూరనున్నాయి.
ఇక రాష్ట్రంలో పోలీస్ భవనాల కోసం ప్రభుత్వం రూ.210 కోట్లు కేటాయించగా నిర్మాణం చివరి దశలో ఉన్న వరంగల్ పోలీస్ కమిషనరేట్ భవనానికి గరిష్ఠంగా నిధులు విడుదల కానున్నాయి. ఈ ఏడాదిలో భవన నిర్మాణం పూర్తయ్యే అవకాశమున్నది.
ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన మేడారం జాతరలో ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.354 కోట్లు ఖర్చు చేసినట్లు బడ్జెట్లో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన గ్రామ పంచాయతీలకు కొత్తగా భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం రూ.300 కోట్లు కేటాయించింది. ఉమ్మడి జిల్లాలోని 139 గిరిజన పంచాయతీల కొత్త భవనాల నిర్మాణం వేగంగా కొనసాగనున్నది.
మహబూబాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ త్వరలోనే నెరవేరబోతున్నది. గత నెల 12న మహబూబాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించిన సందర్భంలో జిల్లాకు ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు చేస్తామని సీఎం ప్రకటించారు. ఈ మేరకు నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ జేఎన్టీయూ నుంచి త్రిసభ్య కమిటీ జిల్లాకు వచ్చింది. మహబూబాబాద్ ఆర్డీవో కొమురయ్య, రెవెన్యూ అధికారులు, కమిటీ సభ్యులతో కలిసి జిల్లా కేంద్రంలో మూడు చోట్ల స్థలాలను పరిశీలించారు. స్థల ఎంపిక పూర్తయిన తర్వాత ఇంజినీరింగ్ కాలేజీ భవన నిర్మాణం కోసం టెండర్ల ప్రక్రియ ప్రారంభించనున్నారు. తాజాగా సోమవారం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఇంజినీరింగ్ కళాశాల విషయాన్ని ప్రస్తావించారు. జేఎన్టీయూ పరిధిలో రాష్ట్రంలో నాలుగు కొత్త ఇంజినీరింగ్ కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని, ఇందులో ఇప్పటికే రాజన్న సిరిసిల్ల, వనపర్తి జిల్లాలో ప్రారంభించామని చెప్పారు. త్వరలోనే మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉన్న కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం స్టీల్ ప్లాంట్ విషయాల్లో ఎనిమిదిన్నరేండ్లు పూర్తవుతున్నా కేంద్రం ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. మారుమూల గిరిజన ప్రాంతమైన మహబూబాబాద్లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాదే తరగతులను ప్రారంభించినట్లు గుర్తు చేశారు.
జయశంకర్ భూపాలపల్లి (నమస్తే తెలంగాణ): కొత్త ఈహెచ్ఎస్ను ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకురావాలని సర్కారు నిర్ణయించింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇదొక వరం. ఎంప్లాయిస్ హెల్త్కేర్ ట్రస్టుకు సంబంధించిన విధి విధానాలను త్వరలోనే ప్రకటిస్తామని బడ్జెట్ సందర్భంగా ఆర్థికమంత్రి హరీశ్రావు చెప్పడం అభినందనీయం. అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పరిచేలా రాష్ట్ర బడ్జెట్ ఉంది.
– కామిడి సతీశ్రెడ్డి, పీఆర్టీయూ
(టీఎస్) జిల్లా ఉపాధ్యక్షుడు, భూపాలపల్లి
జయశంకర్ భూపాలపల్లి(నమస్తే తెలంగాణ): నేను డీఆర్డీఏ సెర్ప్లో 2003 నుంచి కమ్యూనిటీ కో ఆర్డినేటర్గా పనిచేస్తున్నా. వేతనాల గురించి గత ప్రభుత్వాలకు విన్నవించినా మా సమస్యను ఎవరూ పట్టించుకో లేదు. సెర్ప్ ఉద్యోగులకు వచ్చే ఏప్రిల్ నెల నుంచి పే స్కేల్ ఇస్తామని బడ్జెట్లో ప్రకటించారు. చాలా సంతోషం. పే స్కేల్ ఇస్తే వేతనం రూ.50 వేల నుంచి రూ. 60 వేల వరకు పెరుగుతుంది. సీఎం కేసీఆర్ సార్కు రుణపడి ఉంటం.
– జి. సంతోష్ కుమార్, సీసీ, డీఆర్డీఏ సెర్ప్, గొర్లవీడు క్లస్టర్, భూపాలపల్లి
కురవి: సీఎం కేసీఆర్ తనకు రైతాంగంపై ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నాడు. అన్నదాతల కోసం బడ్జెట్ల రూ. 26వేలకోట్ల 831లు కేటాయించిన్రు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత రైతుకు భరోసా దక్కింది. రైతు ఆత్మహత్యలు లేని దేశ నిర్మాణానికి బీఆర్ఎస్ను స్థాపించి.. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. యావత్ రైతులోకం ఆయన వెంటే ఉంటుంది.
– దొడ్డ గోవర్ధన్రెడ్డి, ఆంధ్రాబ్యాంకు కర్షక సేవా సహకార సంఘం చైర్మన్, కురవి
డోర్నకల్: రాష్ట్ర బడ్జెట్లో విద్యా శాఖకు రూ. 19.93 కోట్లు ప్రకటించడం సంతోషకరం. ఇది విద్యాభివృద్ధికి ఉపయోగకరంగా ఉంది. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. ఇప్పటికే సర్కారు బడులను బలోపేతం చేస్తున్నారు. ప్రభుత్వం పేద విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమం, సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. కార్పొరేట్కు దీటుగా విద్యను అందిస్తున్నది.
– టీ. విద్యాసాగర్, ఎస్సీ, ఎస్టీ టీచర్స్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు
గోవిందరావుపేట: రైతులకు రూ. లక్ష రుణ మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించి, నేడు బడ్జెట్ల నిధులు కేటాయించడం సంతోషంగ ఉంది. ఇప్పటికే రైతు బంధు, రైతు బీమా అందిస్తూ వెన్నుదన్నుగా నిలుస్తున్రు. ప్రభుత్వం చేస్తున్న రుణమాఫీతో నాకు మేలు జరుగుతది. రైతులకు అండగా ఉంటున్న కేసీఆర్కు ప్రజల దీవెనలు ఎప్పుడూ ఉంటయ్.
– జర్పుల సుగుణ, రైతు, సండ్రగూడెం(గోవిందరావుపేట)
హనుమకొండ: ఎంప్లాయిస్ హెల్త్ కేర్ సెంటర్ ఏర్పాటు అభినందనీయం. సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. బడ్జెట్లో వ్యవసాయం, నీటి పారుదల, విద్య, వైద్య రంగాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం, దళిత బంధు కోసం అధిక నిధులు కేటాయించడం సంతోషం. నగదు రహిత ఆరోగ్య పథకం కోసం రూ. 700 కోట్లు ప్రకటించడం హర్షణీయం. సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్కు టీజీఓ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు. కాంట్రాక్టు ఉద్యోగులను ఏప్రిల్ నుంచి క్రమబద్ధీకరణ చేస్తామని, సెర్ప్ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తామని ప్రకటించడం చాలా సంతోషంగ ఉంది.
– ఏ జగన్మోహన్రావు, టీజీఓ ఉమ్మడి వరంగల్ జిల్లా కో ఆర్డినేటర్
పాలకుర్తి: బడ్జెట్ల రైతుల కోసం వేల కోట్ల రూపాయలు కేటాయించడం బాగుంది. రైతులు బాగుంటేనే దేశం, రాష్ట్రం బాగుంటుందని సీఎం కేసీఆర్ సార్ రైతుబంధు పథకానికి రూ. 15, 075 కోట్లు ప్రకటించిన్రు. రైతు బంధు పైసలు ఎవుసానికి ఎంతగానోఉపయోగపడుతున్నయ్.
– లావుడ్యా యాకూబ్, రైతు, కొండాపురం(పాలకుర్తి)
మరిపెడ: బడ్జెట్ల ఎవుసానికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. రుణమాఫీకి రూ. 6,385 కోట్లు కేటాయించడం హర్షణీయం. వ్యవసాయం, విద్యుత్ రంగాలతో పాటు రైతుబంధు, రైతు బీమాలకు రూ. 46,280 కోట్లు ప్రకటించారు. ఇది కర్షకులకు మంచి పరిణామం.
– దుబ్బాక లక్ష్మారెడ్డి, రైతు, మరిపెడ
వరంగల్: కేసీఆర్ ప్రభుత్వం సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం ప్రకటించిన రూ. 3 లక్షల పథకం పేదల కల తీర్చనుంది. రాష్ట్ర బడ్జెట్ అణగారిన వర్గాల అభివృద్ధికి దోహద పడుతుంది. పేదల సంక్షేమానికి పెద్ద పీట వేశారు. అభివృద్ధి, సంక్షేమం సమంగా ముందుకు తీసుకుపోయే బడ్జెట్ ఇది.
– దేవరకొండ సురేందర్, వ్యాపారి, మట్టెవాడ
ఖిలావరంగల్: ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 700 కోట్లతో ఈహెచ్ఎస్ను అమలు చేయడం హర్షించదగిన విషయం. సీఎం కేసీఆర్కు ఉద్యోగులపై ఉన్న ప్రేమకు ఇదే నిదర్శనం. ఉద్యోగులు, పింఛన్దారులకు ఒక శాతం చందాతో కూడిన నగదు రహిత వైద్య సహాయం ఏర్పాటు చేయడం బాగుంది. దీనికి రూపకర్తలైన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు.
– గజ్జెల రాంకిషన్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు, వరంగల్
వర్ధన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసింది. వ్యవసాయ రంగ ప్రగతి కోసం భారీగా నిధులను కేటాయించడం హర్షణీయం. దీంతో అన్నదాతలకు ప్రయోజనం చేకూరుతది. ఈ బడ్జెట్తో రానున్న రోజుల్లో రైతులు మరింత అభివృద్ధి చెందుతరు.
– కమ్మగోని స్వామిరాయుడు, ఏఎంసీ చైర్మన్, వర్ధన్నపేట
జయశంకర్ భూపాలపల్లి(నమస్తే తెలంగాణ): రాష్ట్ర బడ్జెట్లో అభివృద్ధి సంక్షేమానికి సమ ప్రాధాన్యతను ఇచ్చింది. విద్య, ఆరోగ్యం, సంక్షేమానికి అధిక నిధులు కేటాయించింది. ఆయిల్ పామ్ సాగు కోసం రూ. వెయ్యి కోట్లు ప్రకటించింది. కాళేశ్వరం టూరిజం సర్క్యూట్కు రూ.750 కోట్లు, రుణమాఫీ, దళితబంధు, డబుల్ బెడ్రూం ఇండ్ల స్కీంలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చి నిధులను కేటాయించింది. ఇది అన్ని వర్గాల ప్రజలకు ఆమోద యోగ్యమైన బడ్జెట్.
– గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్యే, భూపాలపల్లి