వరంగల్ చౌరస్తా, డిసెంబర్ 21 : వరంగల్ ఎంజీఎం దవాఖానలో కరోనా కేసు నమోదు అయిందన్న పుకారు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీంతో గతంలో కరోనా మోగించిన మృత్యు ఘంటికలను గుర్తు చేసుకుంటూ రోగులు, అటెండెంట్లు భయాందోళనలకు గురయ్యారు. భూపాలపల్లి జిల్లాకు చెందిన 61ఏళ్ల మహిళ కరోనా లక్షణాలతో ఎంజీఎం కొవిడ్ వార్డులో చేరిందని, నగరానికి చెందిన మరో ఆరుగురు వ్యక్తుల నుంచి కూడా నమూనాలు సేకరించి కొవిడ్ పరీక్షలు నిర్వహించడానికి వైద్యాధికారులు హైదరాబాద్ ల్యాబ్కు పంపించినట్లు వాట్సాప్లో తప్పుడు వార్తలు సర్క్యులేట్ అయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ఇప్పటి వరకు దవాఖానకు కరోనా జేఎన్-1 లక్షణాలు ఉన్న రోగులు రాలేదని స్పష్టం చేశారు.
అనుమానితురాలిగా గుర్తించిన మహిళకు సారి (ఎస్ఏఆర్ఐ)వార్డులో ప్రత్యేక వైద్య చికిత్స అందిస్తున్నామని, శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆరుగురు వ్యక్తులకు సైతం నమూనాలు సేకరించి కాకతీయ మెడికల్ కళాశాలలోని వైరాలజీ ల్యాబ్కు పంపించామని, రిపోర్టు ఆధారంగా చికిత్స చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు పాజిటివ్ కేసులను గుర్తించలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతానికి 50 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశామని ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ వివరించారు. అలాగే హాస్పిటల్లో మాస్క్ను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.