నయీంనగర్, జనవరి 31 : రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని, కార్మిక, కర్షకుల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్న ప్రధాని నరేంద్రమోదీని గద్దె దింపాలని సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్సేన్ పిలుపు నిచ్చారు. హనుమకొండ పబ్లిక్ గార్డెన్లోని నేరెళ్ల వేణుమాధవ్ ఆడిటోరియంలో బుధవారం సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఉప్పలయ్య అధ్యక్షతన సభ జరిగింది. అంతకుముందు వేయి స్తంభాల దేవాలయం నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు మహా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తపన్సేన్ మాట్లాడుతూ.. మోదీ విద్వేష, మత రాజకీయాలు చేస్తుండడంతో ప్రజల జీవితాలు సంక్షోభంలో కూరుకు పోయాయన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.
ఫాతిమానగర్లోని బాలవికాసలో ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు సీఐటీయూ ఆలిండియా వర్కింగ్ కమిటీ సమావేశాలు జరుగనున్నట్లు తెలిపారు. అంతకుముందు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యు డు బీవీ రాఘవులు మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించక పోతే దేశంలో హక్కులుండవన్నారు. ప్రశ్నించే కవులు, మేధావులు, ఉద్యమకారులను జైల్లో పెట్టించారన్నారు. ప్రొఫెసర్ సాయిబాబా, వరవరావుల ఆరోగ్యం బాగా లేకపోయినా జైళ్లల్లో వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ ఆలిండియా కోశాధికారి సాయిబాబు, రాష్ట్ర ప్రధా న కార్యదర్శి పాలడుగుల భాస్కర్, కార్యదర్శులు వెంకటేశ్, రాగుల రమేష్, హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు గాదె ప్రభాకర్రెడ్డి, రజిత, చక్రపాణి, చుక్కయ్య, వాసుదేవరెడ్డి పాల్గొన్నారు.