వరంగల్, మార్చి 13(నమస్తేతెలంగాణ): వరంగల్ జిల్లా కలెక్టర్గా పీ ప్రావీణ్య నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల కావడంతో ఆమె కలెక్టర్గా బాధ్యతలూ స్వీకరించారు. ఏడాదిన్నరకు పైగా ఇక్కడ కలెక్టర్గా పనిచేసిన బీ గోపి బదిలీ అయ్యారు. ఆయనను జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంట్లో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. 2016 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన గోపి హైదరాబాద్లో నిజాంపేట మున్సిపల్ కమిషనర్గా పని చేశారు. 2021 సెప్టెంబర్ ఒకటిన ప్రమోషన్పై జిల్లా కలెక్టర్గా నియమితులయ్యారు. సరిగ్గా ఏడాదిన్నరకుపైగా ఆయన ఇక్కడ పనిచేశారు.
సోమవారం గోపిని బదిలీ చేస్తూ ఆయన స్థానంలో ప్రావీణ్యను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఈ ఉత్తర్వులు విడుదల చేశారు. 2016 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ప్రావీణ్య గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ)కమిషనర్గా పనిచేశారు. ఇప్పుడు వరంగల్ జిల్లా కలెక్టర్గా నియమితులయ్యారు. ఉత్తర్వులు అందగానే ప్రావీణ్య బదిలీపై వెళ్తున్న గోపి నుంచి కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీవత్స కోట, కలెక్టర్ కార్యాలయం ఏవో శ్రీకాంత్ కొత్త కలెక్టర్ ప్రావీణ్యను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు చెప్పారు. అలాగే, కలెక్టర్ కార్యాలయం అధికారులు, సిబ్బంది, జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ప్రావీణ్యను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత జిల్లా కలెక్టర్గా వచ్చిన ప్రావీణ్య రెండో మహిళా ఐఏఎస్. తొలి కలెక్టర్గా ప్రశాంత్జీవన్ పాటిల్ పనిచేశారు. ఆయన తర్వాత జిల్లా కలెక్టర్గా ఎం హరిత సుదీర్ఘకాలం పాటు పనిచేశారు. ఇక్కడ జాయింట్ కలెక్టర్గా పనిచేస్తూ ఆమె కలెక్టర్గా నియమితులయ్యారు. 2021 సెప్టెంబర్ 1న హరిత బదిలీ కావడంతో ఆమె స్థానంలో గోపి వచ్చారు. ఈయన బదిలీతో ప్రావీణ్య జిల్లాకు నాలుగో కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో పొరుగున ఉన్న హనుమకొండ జిల్లా కలెక్టర్గా మహిళా ఐఏఎస్ సిక్తా పట్నాయక్ రావడం, తాజాగా వరంగల్ జిల్లా కలెక్టర్గా మరో మహిళా ఐఏఎస్ రావడం విశేషం.
18 నెలల పాటు గ్రేటర్ కమిషనర్గా ప్రావీణ్య బాధ్యతలు..
వరంగల్ : గ్రేటర్ కార్పొరేషన్ కమిషనర్ ప్రావీణ్య బదిలీ అయ్యారు. ఆమె గ్రేటర్ కమిషనర్గా 18 నెలల పాటు విధులు నిర్వర్తించారు. 2021 సెప్టెంబర్ 3న ఆమె గ్రేటర్ కార్పొరేషన్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. 18 నెలలు విధులు నిర్వర్తించిన కమిషనర్ ప్రావీణ్య పాలనా పరమైన సంస్కరణలు తీసుకువచ్చారు. అభివృద్ధి పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో ఇచ్చిన టార్గెట్ను పూర్తి చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు అడుగులు వేశారు. స్టేక్ హోల్డర్ల సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. కుడా వైస్ చైర్మన్గా ఉన్న ఆమె మా సిటీ వెంచర్కు రూపం తీసుకువచ్చారు. ప్లాట్ల వేలం నిర్వహించారు. ఆమెను బదిలీ చేసిన ప్రభుత్వం గ్రేటర్ కార్పొరేషన్కు కొత్త కమిషనర్గా ఎవరికీ పోస్టింగ్ ఇవ్వలేదు. రెండు, మూడు రోజుల్లో కొత్త కమిషనర్ను నియమించే అవకాశాలు ఉన్నాయి.