హుస్నాబాద్, నవంబర్ 8: హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో మూడోసారి విజయం సాధిస్తానని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి వొడితెల సతీశ్కుమార్ అన్నారు. హుస్నాబాద్లోని ఐవోసీ భవనంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి బుధవారం ఆయన నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డితో కలిసి మాట్లాడారు. ప్రజల ఆశీర్వాదంతో 2014, 2018 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందినట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లోనూ ప్రజలు గెలిపిస్తారనే నమ్మకం ఉందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ సహకారంతో నియోజకవర్గానికి కోట్లాది రూపాయల నిధులు తెచ్చి రోడ్లు, డ్రైనేజీలు, భవనాలు, గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించినట్లు చెప్పారు.
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంపై సంపూర్ణ అవగాహన ఉన్న సతీశ్కుమార్ను ప్రజలు గెలిపించుకోవాలని కోరారు. గౌరవెల్లి ద్వారా హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాలకు సాగునీరందగా చిగురుమామిడి, సైదాపూర్ మండలాలకు మిడ్మానేరు ద్వారా, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలకు దేవాదుల ద్వారా సాగునీరందుతుందని చెప్పారు. ఎల్కతుర్తి-సిద్దిపేట-మెదక్-నాందేడ్ హైవే నిర్మాణంతో హుస్నాబాద్ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయన్నారు. సతీశ్కుమార్కు హ్యాటిక్ విజయం అందించాలని ఓటర్లను కోరారు. మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి మాట్లాడుతూ గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణంలో సతీశ్కుమార్ కృషి అభినందనీయమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కుర్చీల కొట్లాట తప్ప అభివృద్ధి ఉండదన్నారు. రాష్ట్రంలో బీజేపీ అడ్రస్ గల్లంతయిందన్నారు.