నయీంనగర్, జనగామ రూరల్, మార్చి13 : బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ చుట్టూ హైడ్రామా నడిచింది. తనను బీజేపీలో చేరాలని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెత్తనం చెలాయించడం, హైదరాబాద్ వెళ్తున్న ఆయనను అడ్డుకొని కారులోంచి లాగి చొక్కా చినిగేలా చేయడం.. ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.. మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ హనుమకొండ ప్రశాంత్నగర్లోని ఆయన నివాసంలో బుధవారం ఉదయం10గంటలకు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ప్రారంభానికి ముందే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కూడా మాజీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, మర్రి యాదవరెడ్డి, నాగుర్ల వెంకన్న చేరుకుని రమేశ్తో మాట్లాడుతున్న క్రమంలో బీజీపీ నాయకులు పెద్ద సంఖ్యలో వచ్చి వాగ్వాదానికి దిగారు. తర్వాత ఎర్రబెల్లి తన కారులో రమేశ్ను హైదరాబాద్ తీసుకెళ్తుండగా జనగామ మండలం పెంబర్తి వద్ద బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అడ్డుకున్నారు. బారికేడ్లు, వాహనాలను రోడ్డుకు అడ్డంగా పెట్టారు.
అంతేకాకుండా కారులోంచి రమేశ్ను బయటకు లాగి గుంజుకుపోయే ప్రయత్నం చేశారు. ఈ తోపులాటలో అరూరి అంగీ చినిగింది. వారిని విదిలించుకొని రమేశ్ మాట్లాడుతూ ‘నన్ను ఎవరూ బలవంతగా తీసుకుపోతలేరు, నా వ్యక్తిగత పనిమీద వెళ్తున్నా’ అని చెప్పినా బీజేపీ నాయకులు వినకుండా హంగామా చేశారు. విషయం తెలిసి పెంబర్తికి చెందిన కొందరు బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకొని బీజేపీ నాయకుల చేరలోంచి రమేశ్ను విడిపించి హైదరాబాద్కు పంపించారు.