న్యూఢిల్లీ, ఆగస్టు 7: బీజేపీ పాలిత ఛత్తీస్గఢ్లో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పోలీసు నియామక పరీక్ష ఫలితాల్లో కొన్ని చిత్ర విచిత్రాలు వెలుగుచూశాయి. న్యూస్, స్పేస్ రాణి, హేరామ్, తుఫైల్ వంటి విచిత్రమైన పేర్లు ఉత్తీర్ణుల జాబితాలో కనిపించడం అక్రమాలపై ఆరోపణలకు దారితీసింది. ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి తీవ్ర ఆరోపణలు వస్తుండగా అభ్యర్థులు కూడా తమ వింత పేర్లను సమర్థించుకునేందుకు స్పందిస్తున్నారు.
సుబేదార్, సబ్ ఇన్స్పెక్టర్, ప్లాటూన్ కమాండర్ పోస్టుల ప్రాథమిక నియామక పరీక్షలో అక్రమాలు జరిగాయని ఆరోపించడానికి కాంగ్రెస్ ఆ జాబితాలోని విచిత్రమైన పేర్లను ఆయుధంగా చేసుకున్నప్పటికీ ఛత్తీస్గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(సీజీపీఎస్సీ) ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యర్థులు అందించిన వివరాలను ఈ రికార్డులు కచ్చితంగా ప్రతిబింబిస్తున్నాయని సర్వీస్ కమిషన్ స్పష్టం చేసింది. తమ అడ్మిట్ కార్డులపై ఉన్న పేర్లతోనే ఈ అభ్యర్థులు ధృవపత్రాల పరిశీలన, శారీరక పరీక్షలు, ప్రాథమిక పరీక్షలకు హాజరయ్యారని కమిషన్ తెలిపింది.
హోం శాఖ పరిధిలోని 341 పోస్టుల భర్తీకి సంబంధించి సీజీపీఎస్సీ జూలై 12న రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో ప్రాథమిక పరీక్షను నిర్వహించింది. ప్రాథమిక పరీక్ష ఫలితాలు ఆగస్టు 4న వెలువడ్డాయి. ఇందులో 7,301 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. అయితే న్యూస్, స్పేస్ రాణి, హేరామ్, భక్త ప్రహ్లాద్, తుఫైల్ వంటి పేర్లు ఉన్న అర్హులైన అభ్యర్థుల జాబితాకు సంబంధించిన ఒక క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం చెలరేగింది.