రైతులు విధిగా జీలుగ విత్తనాలు వాడాలి
జిల్లా వ్యవసాయాధికారి ఉషాదయాళ్
పర్వతగిరిలో అన్నదాతలకు అవగాహన సదస్సు
పర్వతగిరి, మే 28 : మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో రైతులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి ఉషాదయాళ్ మాట్లాడుతూ.. వానకాలం సీజన్లో రైతులు ప్రణాళికతో ముందుకు సాగితే అధిక దిగుబడి సాధించొచ్చన్నారు. రైతులు జీలుగ విత్తనాలు విధిగా వాడుకోవాలని తద్వారా రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించొచ్చన్నారు. అలాగే, భూసారం కూడా పెరుగుతుందని తెలిపారు. అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేయాలని చెప్పారు. ఎకరా విస్తీర్ణంలో 30 వేల మొక్కలు ఉండేలా చూసుకోవాలన్నారు.
త్వరగా పత్తి ఏరితే గులాబీ రంగు పురుగు ఆశించదన్నారు. జిల్లా ఉద్యానవన, పట్టుపరిశ్రమ శాఖ అధికారి శ్రీనివాస్రావు మాట్లాడుతూ.. ఆయిల్పామ్ పంట సాగు చేసిన మూడో సంవత్సరం నుంచి దిగుబడి వస్తుందన్నారు. ఎకరాకు 10 నుంచి 15 టన్నులు దిగుబడి వస్తుందని, టన్నుకు సుమారు రూ.15 నుంచి రూ.17వేల ధర ఉందని వివరించారు. మొదటి రెండు సంవత్సరాలు అంతర పంటలు వేసుకోవచ్చన్నారు. ఎన్పీఎస్ఎం కన్సల్టెంట్ సారంగం మాట్లాడుతూ.. పంటకు యూరియా ఒకేసారి వేయొద్దని సూచించారు. వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ సురేశ్కుమార్, ఏవో ప్రశాంత్ కుమార్, ఏఈవోలు స్రవంతి, రాజేశ్, చందు, రవి, రైతులు దేవేందర్రావు, మల్లయ్య, దేవేందర్, సోమేశ్వర్రావు, సుధాకర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.