‘కాంగ్రెస్ పార్టీలో అందరూ సీఎం అభ్యర్థులే.. ముఖ్యమంత్రి పీఠం కోసం కొట్లాటే తప్ప ప్రజల గోస మాత్రం వారికి పట్టదు.. దేశానికి, రాష్ర్టానికి ఆ పార్టీ చేసింది ఏమీ లేదు.’ అని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ధ్వజమెత్తారు. శుక్రవారం బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్తో కలిసి మంత్రి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే నంబర్ వన్ సీఎం కేసీఆర్ అని, అభివృద్ధిలో తెలంగాణను తొమ్మిదేళ్లలోనే దేశానికే ఆదర్శంగా నిలిపారని పేర్కొన్నారు. చీఫ్ విప్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ కేంద్ర, రాష్ట్ర అధిష్టానం తీరుతో ఆ పార్టీలో టికెట్ ఆశిస్తున్న నాయకులు ఎటూ పాలుపోక నిస్సహాయ స్థితిలో ఉన్నారని, కాంగ్రెస్ సభలకు ప్రజల ఆదరణ శూన్యమని ఎద్దేవా చేశారు.
హనుమకొండ, అక్టోబర్ 20: కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పోటీకి కోసం జిల్లాల వారీగా పోటీపడుతున్నారని రాష్ట్ర హోమ్ మంత్రి మహమూద్అలీ అన్నారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే సీఎం సీటు కోసం 20మందికి పైగా పోటీపడుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో ఐదేండ్ల పాలనలో నలుగురు సీఎంలు మారిన చరిత్ర కాంగ్రెస్దని అన్నారు. 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశానికి, రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ పాలనలో క్రాప్ హాలీడేలు.. పరిశ్రమలకు పవర్ కట్లు ప్రజలు మరిచిపోలేదన్నారు. విద్యుత్ కొరతతో రాత్రి వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి రైతులు చనిపోయిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అభివృద్ధిలో కుంటుపడటమే కాకుండా అన్ని వర్గాలు ఇబ్బందులు పడేవారన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే ఇతర పార్టీలు వస్తూ పోతుంటాయని, కానీ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలు ఉన్నా, లేకున్నా ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు.
ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టడం, రైతులకు ఉచిత విద్యుత్, సాగునీరు, ఇంటింటికీ మిషన్ భగరీథ ద్వారా తాగునీరు అందించడం జరుగుతుందన్నారు. సమైక్య పాలనలో ఉన్న పింఛన్లను దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ.200 నుంచి రూ.2,016 చేసి, మళ్లీ ఇప్పుడు రూ.5వేలకు పెంచనున్నట్లు సీఎం ప్రకటించారన్నారు. తెలంగాణలో శాంతిభద్రతలు మెరుగుపడటంతోపాటు హైదరాబాద్ శాంతిభద్రతలకు నిలయంగా, గంగా జమునా తహజీబ్లా మారిందన్నారు. ముస్లిం మైనార్టీ కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు, ఓవర్సీస్ స్కాలర్షిప్లు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యానికి ప్రాధాన్యమిస్తూ పెద్ద మొత్తంలో నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ గత ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చినవి, ఇవ్వనివి కూడా అమలు చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. మన ఊరు మన బడి, మన బస్తి మన బడి కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. గాంధీజీ వంటి గొప్ప మహనీయుడు సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ దుబాయి కంటే ఎక్కువ అభివృద్ధి జరిగిందని మంత్రి పేర్కొన్నారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్ అండగా నిలుస్తారని మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్తోనే తెలంగాణ మరింత అభివృద్ధి జరుగుతుందని మంత్రి తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు, అన్న చెల్లెలు రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్పై అబండాలు మోపుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒక్కటేనని మతిలేని, పొంతలేని అవాస్తవపు మాటలను ప్రజలు నమ్మరన్నారు. ఏ నియోజక వర్గానికి ఏ అభ్యర్థీ అనేది తెలియని నిస్సహాయ స్థితిలో ఉన్నారని పేరొన్నారు. పార్టీ నిర్వహిస్తున్న సభలకు ప్రజాదరణ కరువైందన్నారు. ఎన్నికల్లో ప్రజలను మోసం చేయాలని చూస్తున్న నాయకులకు ప్రజలు తగిణ గుణపాఠం చెబుతారన్నారు. సీఎం కేసీఆర్ ముచ్చటగా మూడోసారి సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని బలహీన పరచాలని కాంగ్రెస్, బీజేపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ అన్నారు. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో తెలంగాణ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన ఆరు హామీలను ఎందుకు అమలు చేయడం లేదని చీఫ్ విప్ ప్రశ్నించారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ సిరాజొద్దిన్, పులి రజినీకాంత్ పాల్గొన్నారు.