చింతామణి వద్ద పెరుమాళ్లకు చక్రస్నానం
యాగశాలలో హోమాలు
నేడు స్వామివారికి వసంతోత్సవం
మంగపేట, మే 20 : మల్లూరు తిరు కల్యాణోత్సవాల్లో భాగంగా శుక్రవారం భద్రాచలం వేదపండితులు, మల్లూరు దేవస్థాన అర్చక బృందం పెరుమాళ్లకు చక్రతీర్థం(చక్రస్నానం) కార్యక్రమం నిర్వహించారు. వేడుకల్లో భాగంగా పెరుమాళ్లను పల్లకీలో కూర్చోబెట్టి మేళ వాయిద్యాల నడుమ దేవస్థానం నుంచి చింతామణి జలపాతం వద్దకు తీసుకొచ్చి చక్ర స్నానమాచరింపజేసి, పూజలు చేశారు. అనంతరం యాగశాలలో హోమాలు, సాయంత్రం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు.
రాత్రి 8 గంటలకు లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను యాగశాల నుంచి కల్యాణ మండపంలోకి తీసుకొచ్చి నాగవెల్లి క్రతవును సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. వేడుకల్లో ఆయా ప్రాంతాల భక్తులు పాల్గొన్నారు. నేడు (శనివారం) వసంతోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో దేవస్థాన కార్య నిర్వహణ అధికారి శ్రావణపు సత్యనారాయణ, దేవస్థాన పునరుద్ధరణ కమిటీ చైర్మన్ నూతిలకంటి ముకుందం, భద్రాచలం ఆలయ అర్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందం, స్థానిక ప్రధాన అర్చకులు కైంకర్యం రాఘవాచార్యులు, ముక్కామల రాజశేఖర్శర్మ, కారంపూడి పవన్కుమార్ ఆచార్యులు, సీతారాములు, ఈశ్వర్చందుశర్మ, వెంకటనారాయణశర్మ, సుధీర్, డైరెక్టర్ శ్రీనివాసచారి, భక్తులు పాల్గొన్నారు.