బచ్చన్నపేట, మే 8: సామాజిక సేవే పరమావధిగా ఆ కల్నల్ సొంతూరులో విద్యార్థుల శారీరక వికాసానికి చేయూతనిందిస్తున్నాడు. తన తాత పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేసి సొంతూరు జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం దబ్బగుంటపల్లిలో విద్యార్థులకు అల్పాహారం అందించాడు. బెంగళూరుకు చెందిన శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ పలు రాష్ర్టాల్లో విద్యార్థులకు రాగి జావ అందిస్తున్న విషయం తెలుసుకొని వారిని సంప్రదించి మొదట జనగామ జిల్లాలోని మూడు మండలాల్లోని 3వేల మందికి పోషకాహారం అందించాడు. డీఈవో సహకారంతో దీన్ని జిల్లా అంతటా విస్తరించాడు. ఈ కార్యక్రమం త్వరలో సర్కారు ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా విద్యార్థులకు రాగి జావ పంపిణీ చేసేందుకు స్ఫూర్తిగా నిలిచింది. అంతేకాకుండా కల్నల్ నరేందర్రెడ్డి సొంత ఖర్చులతో పిల్లలను విజ్ఞాన, విహారయాత్రలకు తీసుకెళ్లడంతో పాటు కరోనా సమయంలోనూ పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసి దాతృత్వం చాటుకుంటున్నాడు.
దబ్బగుంటపల్లికి చెందిన డాక్టర్ సీ నరేందర్రెడ్డి 1979 నుంచి 2004 వరకు సైన్యంలో పనిచేశారు. ఉద్యోగ విరమణ అనంతరం తన తాత పేర చిర్ర సాయిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి మొదట 2014లో సొంతూరులోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. దబ్బగుంటపల్లిలో ప్రస్తుతం ప్రతి రోజూ ఉదయం రాగిజావతో పాటు సాయంత్రం స్నాక్స్, పల్లి పట్టీలు, నువ్వుల ముద్దలు, బిస్కెట్లు, ఇలా రోజుకో రకం పోషకాహా రం అందిస్తున్నారు. వారానికి ఒకరోజు అదనంగా గుడ్డు కూడా ఇచ్చేవారు. 2016 నుంచి అరటి పండు అందించేందుకు ఏర్పాట్లు చేశాడు.
ఆ తర్వాత 2020లో కల్నల్ నరేందర్ రెడ్డి బెంగళూరులోని శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ వారిని కలిసి మండలంలోని అన్ని గ్రామాల విద్యా ర్థులకు బ్రేక్ పాస్ట్గా పోహకాహారం అందించే కార్యక్రమాన్ని అప్పటి జిల్లావిద్యాశాఖాధికారి యాదయ్య చేతుల మీదుగా బచ్చన్నపేట ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. 2014 నుంచి 4 వేల మంది విద్యార్థులకు నోట్బుక్స్ అందిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి విద్యా సంవత్సరం దబ్బగుంటపల్లి విద్యార్థులను విజ్ఞాన, విహార యాత్రలకు తీసుకెళ్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కరోనా సమయంలోనూ 300 మంది నిరుపేద కుటుంబాలతో పాటు మిడ్ డే మీల్స్ కార్మికులకు నిత్యావసర సరుకులు అందించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు చిత్రలేఖ నం, క్విజ్, ఉపన్యాస పోటీలు, క్రీడా పోటీలు నిర్వహించారు.
జిల్లాలోని అన్ని పాఠశాలల్లో రాగిజావ పంపిణీ..
బెంగళూరుకు చెందిన శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ కార్యదర్శి ఆనంద్ కడాలిని కలిసి జిల్లాలోని మూడు మండలాల్లో 3 వేల మందికి రాగి జావ అందించాలని కోరగా, ఆయన అంగీకరించారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని జిల్లా విద్యాశాఖాధికారి రాము జిల్లా అంతటా విస్తరించాలని అభ్యర్థించారు. ఈ విషయాన్ని ఆనంద్, డీఈవో రాము, ట్రస్టు కోఆర్డినేటర్ కనకయ్య కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సంతో షించి జిల్లాలో ప్రారంభించాలని కోరగా గతేడాది నవంబర్ నుంచి 12 మండలాల్లో చదువుతున్న 32,228 మందికి ప్రతి రోజూ రాగిబెల్లం జావ అందిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రమంతటా అమలు చేసేలా విద్యా శాఖ శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు బాధ్యులతో సంప్ర దించగా రాష్ట్రంలో అమలుకు నిర్ణయం తీసుకుంది.
సామాజిక సేవలోనే ఆత్మసంతృప్తి..
సమాజంలో మన కోసమే కాకుండా ఇతరుల కోసం కూడా జీవించాలన్నదే నా కోరిక, ఆశయం. ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు. ఎంత మందికి సాయం చేశామన్నదే నా ఆలోచన. పది మందికి సాయం చేస్తే వచ్చే సంతృప్తి. కోట్ల ఆదాయం ఉన్నా రాదు. దేశం కోసం సైన్యాధికారిగా సేవలు అందించి గర్వపడ్డా. నేడు సమాజంలో భావిభారత పౌరులు ఆరోగ్యంగా ఎదగాలని, వారు జీవితంలో ఉన్నత స్థాయికి స్థిరపడాలన్న సంకల్పంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నా. నేను చేపట్టిన ఈ కార్యక్రమం రాష్ట్రమంతటా విస్తరించడం ఎంతో ఆనందంగా ఉంది.
– డాక్టర్ కల్నల్ నరేందర్రెడ్డి