నమస్తే నెట్వర్క్, మార్చి 17: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం అక్కడక్కడా వర్షం కురిసింది. కొన్ని చోట్ల మోస్తరు వాన పడగా, మరికొన్ని చోట్ల చిరు జల్లులు కురిశాయి. మహబూబాబాద్ జిల్లాలో పిడుగు పడి నాలుగు మేకలు మృతి చెందాయి. అనుకోని వానతో రైతుల ఆగమాగమయ్యారు. మక్కజొన్న పంట నేలవాలగా, కల్లాల్లోని మిర్చి తడిసింది.
మామిడి కాయలు రాలిపోగా, వరి, పొగాకు పంటలు దెబ్బతిన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో శుక్రవారం ఉదయం 8 గంటల వరకు 13.8 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. చిట్యాల, మహదేవపూర్ మండలాల్లో కల్లాల్లో పోసిన మిర్చి తడవగా, మక్కజొన్న పంట నేలవాలింది. మామిడికాయలు నేల రాలాయి. చింతకుంట రామయ్య పల్లిలో రైతు బుట్టి ఉపేందర్ రెండెకరాల మక్కజొన్న నేలమట్టమైంది. ములుగు జిల్లాలో 10.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఏటూరునాగారంలో మిర్చి కల్లాలు పూర్తిగా తడిసి పోవడంతో ఆరబెట్టేకునేందుకు అవకాశం లేకుండా పోయింది. మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై కొన్ని చోట్ల నీళ్లు నిలిచాయి.
మంగపేట, వెంకటాపూరం(నూగూరు)లో కల్లాల్లో ఆరబోసుకున్న మిర్చి తడిసింది. తాడ్వాయి, వాజేడు మండలాల్లో మోస్తరుగా వర్షం పడింది. వెంకటాపూర్, కన్నాయిగూడెం మండలాల్లో చిరుజల్లులు కురిశాయి. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో కల్లాల్లో ఉన్న మక్కజొన్న, మిర్చి, ఉడకపెట్టిన పసుపు తడవకుండా రైతులు టార్పాలిన్ కప్పారు. నెల్లికుదురు, నర్సింహులపేట, పెద్దవంగర, చిన్న గూడూరుఅక్కడక్కడా మక్కజొన్న, పసుపు తడిసింది. డోర్నకల్ మండలంలో మోస్తరు వర్షం కురిసింది.
గార్ల మండలంలో పొగాకు, మక్క జొన్న పంట దెబ్బతింది. గంగారంలో ఈదురు గాలులతో వర్షం పడింది. మండలంలోని జంగాలపల్లి గ్రామంలో పిడుగు పడి నాలుగు మేకలు మృతి చెందాయి. జనగామ జిల్లాలో మోస్తరు వాన కురిసింది. పలు చోట్ల వరి, మక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. హనుమకొండ జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరుగా మరికొన్ని చోట్ల చిరుజల్లులు పడ్డాయి. వరంగల్ జిల్లాలో 3.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. గీసుగొండలో చిరుజల్లులు కురవగా, సంగెం లో మోస్తరు వర్షం కురిసింది. పలు చోట్ల పంటలు దెబ్బతిన్నాయి.