నమస్తే తెలంగాణ నెట్వర్క్, డిసెంబర్ 7: మిగ్జాం తుఫాన్ రైతులను నిండా ముంచింది. తుఫాను కారణంగా మూడు రోజుల నుంచి మబ్బులు కమ్ముకోవడంతో పాటు ముసురు, అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పంటలను తీవ్రంగా నష్టపరిచాయి. కోతకు వచ్చిన వరి ఇంకా నీళ్లలోనే ఉండగా, పత్తి పంట నల్లబారింది. మిరప తోటల్లోకి నీరు చేరి వివిధ చీడపీడలు ఆశించే ప్రమాదం పొంచిఉన్నది. కాగా వివిధ ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలను వ్యవసాయ శాఖ అధికారులు గురువారం పరిశీలించారు.
దాదాపు మూడు రోజులుగా కమ్ముకున్న ముసురు.. అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు అన్నదాతలను నిండాముంచాయి. మిగ్జాం తుఫాను కారణంగా చేతికొచ్చిన పంట నీటిపాలు కాగా ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులు నానాకష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా ములుగు, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో తుఫాను ప్రభావం ఉండగా, వరి, మక్క, మిరప, పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. పలు ప్రాంతాల్లో వ్యవసాయ అధికారులు గురువారం పంట నష్టాన్ని పరిశీలించారు. మరికొద్ది రోజుల్లో కోయాల్సిన పంట నీటిలో తేలుతుండడంతో ఏమీ పాలుపోక రైతులు దిగులు పడుతున్నారు. మరోవైపు పత్తి పంట నల్లబారడంతో ఆందోళన చెందుతున్నారు. చేతికొచ్చిన పత్తి తడిసిపోవడంతో కన్నీరుపెట్టుకుంటున్నారు. చేతికొచ్చిన పంట పావడంతో పాటు చేలల్లో ఉన్న పంటకు చీడపీడలు ఆశించే ప్రమాదముందని భయపడుతున్నారు. మరోవైపు ఈదురుగాలులతో కూడిన వాతావరణంతో ప్రజలు ఇండ్లకే పరిమితమై వ్యాధులతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు దగ్గు, జలుబు, జ్వరంతో అవస్థపడుతున్నారు.