హనుమకొండ సబర్బన్, ఆగస్టు 5 : నగరంలో శుక్రవారం జోరు వాన కురిసింది. దీంతో చైతన్యపురి, ఎస్బీహెచ్, కాకాజీకాలనీ, రెడ్డికాలనీ, ప్రశాంత్నగర్, భవానీనగర్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉదయం పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. అదేవిధంగా వేలేరు, ముప్పారం పెద్ద చెరువులు మత్తడి దుంకడంతో ధర్మసాగర్ రిజర్వాయర్ ఒక గేటును ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో ఎల్కతుర్తి వాగు ఉధృతంగా పారుతోంది. వర్షాలతో మెట్ట పంటలకు నష్టం పెద్ద ఎత్తున వాటిల్లుతోంది.
ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల భారీగా..
జలమయమైన రోడ్లు, లోతట్టు ప్రాంతాలు
వాన మళ్లీ జోరందుకున్నది. తగ్గినట్టే తగ్గి శుక్రవారం తెల్లవారుజాము నుంచి కొన్ని గంటల పాటు దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలతో పాటు రోడ్లపైకి వరద నీరు చేరింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షం కురవగా హనుమకొండలో ప్రధాన రహదారులపై ఉధృతంగా వాన నీరు ప్రవహించి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. అలాగే జనగామ పట్టణానికి ఎగువనున్న రంగప్పచెరువు మత్తడి పోస్తుండడంతో దిగువనున్న కాలనీలతో పాటు హైదరాబాద్-హనుమకొండ రోడ్డును వరద ముంచెత్తింది. వరుసగా కురుస్తున్న వానలకు చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. దంతాలపల్లి మండలం పెద్దముప్పారం వద్ద పాలేరు వాగు ఉధృ తంగా పారుతుండడంతో అధికారులు రాకపోకలు నిలిపివేశా రు. దేవరుప్పుల మండలం పెద్దమడూరు వాగు వరదలో ఇద్దరు రైతులు, ఇద్దరు గీత కార్మికులు చిక్కుకుపోగా పోలీసులు సురక్షింగా కాపాడారు.