వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఆదివారం సాయంత్రం వర్షం దంచికొట్టింది. నగరంలో గంటపాటు ఏకధాటిగా వాన కురిసింది. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. రోడ్లు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. కోతలకు సిద్ధంగా ఉన్న పంటలు నేలవాలడమే కాకుండా కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. ఇప్పటికే కురిసిన వానతో తీవ్రంగా నష్టపోయామని, ఇప్పుడు పంట మొత్తం తుడిచి పెట్టుకుపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
హనుమకొండ సబర్బన్, ఏప్రిల్ 30: హనుమకొండ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఏకధాటిగా గంట పాటు భారీ వర్షం కురిసింది. అన్ని మండలాల్లో పెద్ద ఎత్తున వర్షం పడడంతో పంటలకు నష్టం వాటిల్లింది. నాలుగు రోజులుగా వాతావరణం మబ్బుపట్టి ఉండడంతో పాటు అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే మక్కజొన్న, వరి పంటలు దెబ్బతిన్నాయి. వర్షాలు తగ్గుతాయని రైతులు ఆశించిన తరుణంలో మళ్లీ భారీగా కురిసింది. కోతలకు సిద్ధంగా ఉన్న పంటలకే కాకుండా కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దయింది. ఇప్పటికే రైస్ మిల్లర్లు ధాన్యం నుంచి పూర్తి స్థాయిలో బియ్యం రావడం లేదని గగ్గోలు పెడుతున్నారు. ఈ తరుణంలో ఇప్పుడు కురిసిన వర్షం మరిన్ని ఇబ్బందులకు గురిచేసింది. హార్వెస్టర్లకు కూడా కొరత ఏర్పడింది. అదేవిధంగా వర్షానికి హనుమకొండలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వాహనదారులు ఇబ్బందులు తప్పలేదు.
కమలాపూర్లో..
కమలాపూర్ : మండలంలోని కమలాపూర్, ఉప్పల్, కానిపర్తి, దేశరాజ్పల్లి, శంభునిపల్లి, గూడూరు, అంబాల తదితర గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. కొనుగోలు కేంద్రాలతో పాటు రైతులు ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. పలు గ్రామాల్లో వరి, మక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం జరిగింది.
ధర్మసాగర్లో..
ధర్మసాగర్ : మండలంలోని పలు గ్రామల్లో భారీ వర్షం కురిసింది. ధాన్యం విక్రయించే సమయంలోనే ఒక్కసారిగా వాన కురిసిందని రైతు కంట తడి పెట్టుకున్నాడు. అంతేకాకుండా పలు గ్రామాల్లోని కొనుగోలు కే్రందాల్లోని ధాన్యం వర్షపు నీటిలో మునిగిపోయింది. కాగా, కొన్ని గ్రామాల్లో వరి పంటను కోయలేదు. చేతికి వచ్చే సమయంలో వర్షం కురవడంతో పంట నేల వాలిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విరిగిన విద్యుత్ స్తంభం
పోచమ్మమైదాన్: వరంగల్ 12వ డివిజన్ దేశాయిపేటలోని లక్ష్మీ మెగా టౌన్షిప్లో ఆదివారం రాత్రి వీచిన గాలిదుమారం, వర్షానికి తొమ్మిదో లేన్ డివైడర్ మధ్యలో వీధిలైట్ స్తంభం విరిగి కరెంటు తీగలపై పడింది. దీంతో కాలనీలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వాట్సాప్ గ్రూపు ద్వారా స్థానికులు దేశాయిపేట విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సిబ్బంది వచ్చి జేసీబీతో విద్యుత్ స్తంభాన్ని తొలగించి, సరఫరాను పునరుద్ధరించారు. దీంతో కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.