గీసుగొండ, మార్చి 29 : మండలంలోని మరియపురం గ్రామం 2021-22 సంవత్సరానికి గాను జాతీయ పంచాయతీరాజ్ అవార్డుకు ఎంపికైంది. గ్రామాల్లో చేపట్టిన పలు అభివృద్ధి అంశాలను 9 విభాగాలుగా విభజించి రాష్ట్ర స్థాయిలో ర్యాంకులను ఇవ్వగా మరియపురం హెల్త్ పంచాయతీ, కార్బన్ ఫ్రీ విభాగాల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. దీన్దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ వికాస్ పురస్కార్లో భాగంగా ఈ అవార్డును కేంద్ర ప్రభుత్వం అందించనున్నట్లు ఎంపీడీవో వీరేశం తెలిపారు.
సర్పంచ్ అల్లం బాలిరెడ్డి, కార్యదర్శి నల్లెల స్వప్న లను ఈనెల 31న హైదరాబాద్లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్రావు చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. మరియపురం రెండోసారి రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపిక కావడంతో పలు గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు అభినందనలు తెలిపారు. కాగా, నిర్మల చారిటబుల్ ట్రస్టు ద్వారా ప్రతి నెలా గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సర్పంచ్ బాలిరెడ్డి రోగులకు పరీక్షలు చేసి ఉచితంగా మందులను ఇప్పిస్తున్నారు.
అలాగే ప్రత్యేకంగా మహిళలకు ప్రత్యేక హెల్త్ క్యాంపులను నిర్వహిస్తున్నారు. మరియపురం గ్రామంలో కార్బన్ ఫ్రీ కార్యక్రమాలు పక్కాగా అమలు చేస్తున్నారు. ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించడంతో పాటు రోడ్లకు ఇరువైపులా చెత్త లేకుండా చూస్తున్నారు. సర్పంచ్ తన సొంత ఖర్చులతో గోనె సంచులను ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. గ్రామంలో మొక్కలను రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జీపీ పాలకవర్గం, గ్రామస్తుల సమష్టి కృషితో ఈ రెండు విభాగాల్లో మరియపురం గ్రామం ప్రథమ స్థానంలో నిలిచింది.