వరంగల్, సెప్టెంబర్ 26(నమస్తేతెలంగాణ) : ప్రైవేట్ దవాఖానల నిర్వాహకులు నిబంధనలు పాటించడం లేదని కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటళ్లలో తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వం వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించింది. ఈ క్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్వో) వెంకటరమణ జిల్లాలోని తమ శాఖ అధికారులతో సమావేశమై చర్చించారు. ప్రతి ప్రైవేట్ దవాఖానలో తనిఖీలు నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించారు. ప్రత్యేకంగా ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. పది రోజుల్లో తనిఖీల నిర్వహణ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు గురువారం నుంచి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రైవేట్ హాస్పిటళ్లలో తనిఖీలు నిర్వహించడం ప్రారంభించారు. వైద్య, ఆరోగ్యశాఖ రికార్డుల ప్రకారం జిల్లాలో 170 ప్రైవేట్ దవాఖానలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
వరంగల్తో పాటు నర్సంపేట, వర్ధన్నపేట ప్రాంతాల్లో ఇవి పనిచేస్తున్నాయి. తనిఖీల నిర్వహణకు ఒక్కో బృందానికి డీఎంహెచ్వో సుమారు 35 దవాఖానలను కేటాయించారు. ప్రతి బృందానికి వైద్య, ఆరోగ్యశాఖలోని జిల్లా స్థాయి అధికారి నేతృ త్వం వహిస్తున్నారు. వీరిలో డిప్యూటీ డీఎంహెచ్వోలు డాక్టర్ గోపాల్రావు, ప్రకాశ్తో పాటు ప్రోగ్రాం ఆఫీసర్లు చల్లా మధుసూదన్, సుధార్సింగ్, పద్మశ్రీ ఉన్నారు. ప్రతి టీమ్లో ఇద్దరు ఉద్యోగులు ఉన్నారు. బృందాలు ఇప్పటివరకు సుమారు నలబై హాస్పిటళ్లలో తనిఖీలు జరిపినట్లు అధికారులు తెలిపారు. ప్రైవేట్ దవాఖానల అనుమతితో పాటు అందులో పని చేస్తున్న డాక్టర్ల పేర్లు, ఇతర వివరాలను సేకరిస్తున్నారు. వారు అర్హులా? అనర్హులా? తెలుసుకునేందుకు వారి సర్టిఫికెట్లు, ప్రభుత్వం నుంచి హాస్పిటల్ యాజమాన్యం పొందిన అనుమతి పత్రాలను పరిశీలిస్తున్నారు. ఫిజియోథెరపిస్టు, రేడియాలజిస్టు, ల్యాబ్ టెక్నీషియన్, ఏఎన్ఎం, స్టాప్ నర్సుతో పాటు ఇతర ప్రత్యేక వైద్య నిపుణులు, సిబ్బంది అర్హులేనా?, వీరి స్థానంలో అనర్హులు పనిచేస్తున్నారా? అని నిర్ధారించుకుంటున్నా రు.
ల్యాబ్ సరిగా ఉందా?, అందులో క్వాలిఫై ఉన్న వారే పనిచేస్తున్నారా?, ఆల్ట్రా సౌండ్ మిషన్లు ఉంటే వాటిలో ఎన్ని కేసులు చేశారని తెలుసుకుంటున్నారు. బయో వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలు పాటిస్తున్నారా? లేదా? అని పరిశీలిస్తున్నారు. శానిటేషన్, ఫైర్సేప్టీతో పాటు ఇతర వసతులు, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంటు యాక్టు కింద రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ నిబంధనల ప్రకారం ఉన్నదా? లేదా?, డాక్టర్లు, సిబ్బంది రిజిస్ట్రేషన్ పత్రాలనూ పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఆయా హాస్పిటళ్ల యజమాన్యం ప్రభుత్వం నుంచి ఎన్ని బెడ్లకు అనుమతి తీసుకుంది?, ప్రస్తుతం ఎన్ని బెడ్లు ఉన్నాయి? అని స్వయంగా పరిశీలిస్తున్నాయి. హాస్పిటళ్లలో ఉన్న పేషెంట్లు, వారి కుటుంబ సభ్యులతో వసతులపై మాట్లాడుతున్నారు.
ఎనిమిది దవాఖానలకు నోటీసులు..
ఇప్పటి వరకు తనిఖీలు జరిగిన హాస్పిటళ్లలో లోపాలు ఉన్నట్లు గుర్తించిన ఎనిమిదింటికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు డీఎంహెచ్వో వెంకటరమణ చెప్పారు. చిన్న లోపాలు ఉంటే సరిచేసుకోవాలని నోటీసులు జారీ చేస్తున్నామని, ప్రభుత్వ అనుమతి లేకపోవడంతో పాటు అర్హత గల వైద్యులు, సిబ్బంది లేని హాస్పిటళ్లను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. తనిఖీల నిర్వహణపై ఎప్పటికప్పడు నివేదికను డైరెక్టర్ ఆఫ్ హెల్త్కు పంపుతున్నట్లు తెలిపారు. కాగా, మరో వారం రోజుల పాటు వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల తనిఖీలు కొనసాగే అవకాశం ఉంది. ఇంకా సుమారు 130 హాస్పిటళ్లలో తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే జరిగిన తనిఖీల్లో అర్హత లేని వైద్యులు, సిబ్బందితో పనిచేస్తున్న కొన్ని ప్రైవేట్ హాస్పిటళ్ల సమాచారం, అనుమతి ఉండి ప్రభుత్వ నిబంధనలు పాటించని దవాఖానల వివరాలు వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు అందుతున్నట్లు తెలిసింది. దీనిపై వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా మునుపెన్నడూ లేని రీతిలో ప్రభుత్వ నిబంధనల అమలుపై అన్ని ప్రైవేట్ హాస్పిటళ్లలో అధికారుల తనిఖీలు జరుగుతుండడం తీవ్ర చర్చనీయాంశమైంది. పలు హాస్పిటళ్ల నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘిస్తుండడం, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం ఈ తనిఖీల్లో బయటకొస్తున్నది. కొన్ని ప్రధాన హాస్పిటళ్లలోనూ లొసుగులు ఉండడం, సరైన వసతులు లేకపోవడం వెలుగులోకి వస్తున్నది.