పోచమ్మమైదాన్, సెప్టెంబర్ 22: ప్రైవేట్ దవాఖానల యాజమాన్యాలు విధిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ ఆదేశించారు. వరంగల్లోని రెండు ప్రైవేట్ దవాఖానలను గురువారం రాత్రి ఆయన వైద్యాధికారులతో కలిసి తనిఖీ చేశారు. జిల్లాలో నిర్వహిస్తున్న ప్రైవేట్ దవాఖానలు, క్లినిక్ డైరీ సెంటర్లు, పాలీక్లినిక్, హోమియోపతి క్లినిక్లు, కన్సల్టేషన్ రూమ్స్, నర్సింగ్ హోమ్స్, ఫిజియోథెరపి సెంటర్లు, డెంటల్ క్లినిక్లను జిల్లా ప్రోగ్రాం అధికారులు, డిప్యూటీ డీఎంహెచ్వోలు, డిప్యూటీ డెమో స్టాటిస్టికల్ ఆఫీసర్లు తనిఖీ చేయాలని డీఎంహెచ్వో ఆదేశించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద రిజిస్ట్ట్రేషన్ సర్టిఫికెట్లు నిబంధనల ప్రకారం ఉన్నాయా లేవా.. అలాగే బయో వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలు పాటిస్తున్నారా తదితర విషయాలపై ఆకస్మిక తనిఖీలు చేస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారికి నోటీసులు జారీ చేయాలని సూచించారు. కాగా, వరంగల్ జేపీఎన్ రోడ్డులోని సత్య హాస్పిటల్ను డీఎంహెచ్వో వెంకటరమణ సిబ్బందితో కలిసి పరిశీలించగా, పోచమ్మమైదాన్లోని సృష్టి దవాఖానను ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ మధుసూదన్, డాక్టర్ అనిల్కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి నర్సింగ్ హోంను తనిఖీ చేస్తామన్నారు. జిల్లాలో 170 హెల్త్ స్పెషాలిటీలు ఉన్నట్లు తెలిపారు. ఇందులో రోగులకు అవసరమైన వసతులు ఉన్నాయో లేదో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం హెల్త్ సెంటర్లు నడువకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సరైన వైద్యం లేకపోవడం, ఎక్కువ చార్జీలు వేయడం, రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడం, ల్యాబ్, ఆల్ట్రాసౌండ్ తదితర సదుపాయాలు లోపిస్తే వెంటనే నోటీసులు జారీ చేస్తామన్నారు. వైద్య సిబ్బంది నిరంతరం తనిఖీలు చేస్తూ రిపోర్టును ఉన్నతాధికారులకు పంపిస్తున్నట్లు వివరించారు.