చెడగొట్టు వాన రైతన్నను నిండా ముంచింది. ఇంకొన్ని రోజుల్లో పంట చేతికొస్తుంది.. అనుకుంటున్న సమయంలో ఈదురు గాలులతో కూడిన వర్షం అన్నదాతను కోలుకోకుండా చేసింది. జిల్లా వ్యాప్తంగా శనివారం రాత్రి 49.5 మిమీ వర్షపాతం నమోదైంది. 249 గ్రామాల్లో తీవ్ర ప్రభావం చూపింది. ప్రధానంగా మక్కజొన్న, వరి, మిర్చి పంటలు నేలవాలాయి. 57,855 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. విద్యుత్ స్తంభాలు విరిగి కరంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పదుల సంఖ్యలో గొర్రెలు మృత్యువాత పడ్డాయి. పలు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ధ్వంసమైన పంటలను ప్రజాప్రతినిధులు, వ్యవసాయాధికారులు పరిశీలించారు. నష్టం వివరాలను నమోదు చేసుకున్నారు.
వరంగల్, మార్చి 19(నమస్తేతెలంగాణ) : అకాల వర్షంతో జిల్లా అతలాకుతలమైంది. శనివారం రాత్రి ఈదురుగాలులతో వడగండ్లు పడ్డాయి. జిల్లాలో సగటు వర్షపాతం 49.5 మిల్లీమీటర్లు నమోదైంది. ఖానాపురంలో 70.8, నెక్కొండలో 67.2 మి.మీ వర్షం పడింది. నర్సంపేటలో 62.2, వరంగల్లో 56.6, గీసుగొండలో 55.4, దుగ్గొండిలో 51.2, నల్లబెల్లిలో 48.2, పర్వతగిరిలో 44.2, వర్ధన్నపేటలో 38.4, రాయపర్తిలో 35.2, సంగెంలో 34.8, చెన్నారావుపేటలో 30.2 మి.మీ వర్షం కురిసింది. దీంతో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మక్కజొన్న, మిరప, వరి పంటలు దెబ్బతిన్నాయి.
పత్తి, వేరుశనగ, అరటి, జొన్న, మామిడి, ఇతర పంటలదీ ఇదే పరిస్థితి. జిల్లావ్యాప్తంగా 249 గ్రామాల్లో 43,424 మంది రైతులకు చెందిన 57,855 ఎకరాల్లోని వివిధ పంటలు ముప్పైమూడు శాతానికిపైగా దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఒక్క మక్కజొన్న పంటే 48,101 ఎకరాల్లో ధ్వంసమైంది. తర్వాత 9,450 ఎకరాల్లో వరి, మామిడి 249, పత్తి 31, వేరుశనగ 16, జొన్న 8 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లా వ్యవసాయాధికారి ఉషాదయాళ్ పంట నష్టం జరిగిన గ్రామాల్లో ఆదివారం పర్యటించారు. అలాగే, 86 గ్రామాల్లోని 2,668 మంది రైతులకు చెందిన 2,835 ఎకరాల్లో అరటి, డ్రాగన్ ఫ్రూట్, వాటర్ మిలాన్, కూరగాయ పంటలు దెబ్బతిన్నట్లు ప్రభుత్వానికి నివేదిక పంపారు. అలాగే, దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పరిశీలించారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ డివిజన్లలో పర్యటించారు. సంగెం, గీసుగొండ మండలాల్లో పంట నష్టంపై పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఫోన్లో అధికారులతో మాట్లాడారు.