సుబేదారి, ఏప్రిల్ 25 : భూ వివాదం కేసులో వ్యక్తిని తుపాకీతో బెదిరించిన హసన్పర్తి సీఐ రావుల నరేందర్ను వరంగల్ సీపీ బదిలీ చేశారు. సీఐపై వచ్చిన ఆరోపణలపై విచారణ అనంతరం వీఆర్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హసన్పర్తి మండలంలోని సీతంపేటకు చెందిన అన్నదమ్ములు గిన్నారపు మల్లయ్య, చేరాలుకు 587 సర్వే నంబరులో మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. వీరి సమీప బంధువులు నలుగురు వీరిద్దరి భూ మిని ఆక్రమించుకున్నారు. దీంతో మల్లయ్య, చేరాలు హసన్పర్తి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వడ్డేపల్లికి చెందిన రౌడీషీటర్ తాళ్లపల్లి సునీల్ కబ్జా చేసిన వారి తరఫున సీఐ నరేందర్తో మాట్లాడాడు. కబ్జాదారులు సీఐకి రూ.50 వేలు లంచం ఇచ్చారు.
ఈ కేసులో తమకు అన్యాయం జరుగుతున్నదని గమనించిన బాధితుడు మల్లయ్య కుమారుడు దేవెందర్ సీపీకి ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశాడు. మరో బాధితుడు చేరాలు కుమారుడు రాజు వారం క్రితమే సీపీకి ఫిర్యాదు చేశాడు. స్పందించిన సీపీ స్పెషల్ బ్రాంచ్ అధికారులతో విచారణ చేయించగా, నిజమేనని తేలింది. మూడు రోజుల క్రితం మరో రౌడీషీటర్ అబ్దుల్ హుస్సేన్, అనిల్రెడ్డి సాయంతో ఎస్బీ అధికారులకు లంచం విషయం చెప్పిన రౌడీషీటర్ సునీల్ను హనుమకొండ వికాస్నగర్కు పిలిపించుకుని తుపాకీతో బెదిరించి కాళ్లు మొక్కించుకున్నాడు. రూ.50 వేలు లంచం ఇవ్వలేదని చెప్పించి ఫోన్లో రికార్డు చేయించాడు. కాగా, రౌడీషీటర్ సునీల్ను లంచం విషయం చెప్పినందుకు తనను హసన్పర్తి సీఐ నరేందర్ తుపాకీతో బెదిరించాడని సోమవారం సుబేదారి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సునీల్ పిటిషన్పై విచారిస్తున్నామని సుబేదారి సీఐ షుకూర్ తెలిపారు.