హనుమకొండ, నవంబర్ 10 : పింఛన్దారులు తాము జీవించే ఉన్నామని వార్షిక ధ్రువీకరణ పత్రం సమర్పించేందుకు సమయం ఆసన్నమైంది. జీవన్ ప్రమాణ పత్రం దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 1వ తేదీ నుంచి మార్చి 31వరకు గడువు విధించింది. ఈలోగా పెన్షనర్లు తాము జీవించి ఉన్నట్లు ‘లైఫ్ సర్టిఫికెట్’ ఇస్తే సరిపోతుంది. లేకపోతే ఏప్రిల్ నెల నుంచి పెన్షన్ రావడం నిలిచిపోతుంది. ఇందుకోసం ట్రెజరీ కార్యాలయం చుట్టూ తిరిగే అవసరం లేకుండా మీసేవా కేంద్రాల్లో గానీ లేదా కొత్తగా అందుబాటులోకి తెచ్చిన టీయాప్ ఫోలియో ఆండ్రాయిడ్ యాప్ ద్వారా సర్టిఫికెట్ సమర్పించే వెసులుబాటు కల్పించింది.
రాష్ట్ర ప్రభుత్వ పింఛన్దారులు లైఫ్ సర్టిఫెకెట్లు దాఖలు చేసేందుకు ఈ నెల ఒకటో తేదీ నుంచి 2023 మార్చి 31 వరకు గడువు విధించడంతో పింఛన్దారులు సమాయత్తం అవుతున్నారు. జీవన్ ప్రమాణ పత్రం దాఖలుకు పింఛన్దారుల సంక్షేమ సంఘాలు కూడా తోడ్పాటును అందిస్తున్నాయి. వారి సంఘ కార్యాలయాల్లో ప్రత్యేక హెల్ప్ డెస్ల్ను ఏర్పాటుచేసి ఉచిత సేవలందిస్తున్నాయి. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో సైతం పెన్షన్దారులకు సేవలందించేందుకు ప్రత్యేకంగా ఒక సేవా కేంద్రం కూడా పనిచేస్తోంది. పింఛన్దారులు గడువులోగా జీవించి ఉన్నట్లు తమ వార్షిక ధ్రువీకరణ పత్రం(లైఫ్ సర్టిఫికెట్) అందించకపోతే వచ్చే ఏప్రిల్ నెల నుంచి పింఛన్ నిలిచిపోతుంది.
కొత్త సాంకేతికతో వేగంగా..
కాలానుగుణంగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే విధానంలోనూ రాష్ట్ర సర్కారు ఆధునిక సాంకేతిక పద్ధతిని వినియోగిస్తోంది. దీని వల్ల వేగంగా, కచ్చితంగా పింఛన్ చెల్లించాలనే ఉద్దేశంతో ఆర్థిక శాఖ, జిల్లా ట్రెజరీ కార్యాలయాల్లో సమూల మార్పులు చేసింది. ఇందుకోసం టీయాప్ ఫోలియో ఆండ్రాయిడ్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా జీవన ధ్రువీకరణ పత్రాలు స్వీకరించాలని, లేదా ఆధారిత జీవన్ ప్రమాణ్ సాఫ్ట్వేర్ ద్వారా మీ సేవా కేంద్రాల ద్వారా మాత్రమే లైఫ్ సర్టిఫికెట్లు స్వీకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇలా యాప్ ద్వారా ఆన్లైన్ విధానంలో లైఫ్ సర్టిఫికెట్లు ఆమోదిస్తున్న రాష్ట్రం దేశంలోనే తెలంగాణ మొట్టమొదటిది కావడం విశేషం.
సమర్పించడం ఇలా..
జీవన ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించేందుకు పెన్షనర్ ముందుకు టీయాప్ ఫోలియో యాప్ను ఆండ్రాయిడ్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి. మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మొబైల్ నంబర్, పాస్వర్డ్లను ఎంటర్ చేసి లాగిన్ కావాలి. ఆ తర్వాత పెన్షన్ ఆన్యువల్ వెరిఫికేషన్(బెటా వర్షన్) ఆప్షన్ ఎంటర్ అయి, రిజిస్ట్రేషన్ అనే అప్లికేషన్పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత బ్యాంకు అకౌంట్ నంబర్ లేదా పెన్షనర్ ఐడీ నంబర్లను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఒక సెల్ఫీ ఫొటో తీసుకొన్న తర్వాత సెల్ఫీ ఫొటో, పెన్షన్ పేమెంట్ కాపీలోని ఫొటోతో సరిపోలిన తర్వాత ఆమోదం అయినట్లుగా ఒక ధ్రువీకరణ మెసేజ్తో పాటు ఒక రెఫరెన్స్ నంబర్ వస్తుంది. వెంటనే ఆ వివరాలు సంబంధిత ట్రెజరీ కార్యాలయానికి చేరుతాయి. మొదటిసారి ట్రెజరీ అధికారి ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ద్వారా తన వద్ద ఉన్న పింఛన్దారుడి వివరాలను సరిపోల్చుకొని ఆమోదిస్తారు. ఒకసారి ఆమోదం పొందితే ఏటా మళ్లీ ఆమోదం పొందకుండానే సెల్ఫీతో ఆమోదం పొందవచ్చు. తద్వారా పింఛన్దారుడు మీ సేవా కేంద్రాలకు, ట్రెజరీ కార్యాలయానికి వెళ్లకుండా ఇంట్లో నుంచి గానీ, ఎక్కడ ఉన్నా అక్కడినుంచే తన వార్షిక జీవన ధ్రువీకరణ పత్రాన్ని నేరుగా ట్రెజరీ అధికారులకు సమర్పించవచ్చు. ఇక విదేశాల్లో స్థిరపడ్డ పెన్షనర్లు అక్కడి ఎంబసీ లేదా కాన్సులేట్ ద్వారా మాత్రమే జీవన ధ్రువీకరణ పత్రాన్ని పంపాల్సి ఉంటుంది. బంధువుల ద్వారా గానీ, పోస్టు ద్వారా గానీ పంపిన పత్రాలను ఆమోదించమని ట్రెజరీ అధికారులు స్పష్టంగా చెప్పారు.
జిల్లాలో 15వేల మంది పెన్షన్దారులు
జిల్లా ట్రెజరీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హనుమకొండ జిల్లా కార్యాలయం పరిధిలో(జిల్లా వ్యాప్తంగా) 15వేల మంది పెన్షన్దారులు ఉన్నారు. వీరందరికీ ప్రతి నెలా పెన్షన్ రూపంలో హనుమకొండ జిల్లా ట్రెజరీ, భీమదేవరపల్లి, వరంగల్ తూర్పు, పరకాల సబ్ ట్రెజరీ కార్యాలయాల ద్వారా సుమారు రూ.150కోట్లు చెల్లిస్తున్నారు. నిర్ణీత గడువులోగా సర్టిఫికెట్ సమర్పించకపోవడం వల్ల పింఛన్ ఆగిపోయిన వారు నేరుగా ట్రెజరీ కార్యాలయంలో సంప్రదించి ఆధార్ నంబర్, ఫోన్ నంబర్, పాన్కార్డు నంబర్, అడ్రస్ తదితర వివరాలతో జనన ధ్రువీకరణ పత్రాన్ని అందజేస్తే పెన్షన్ ప్రారంభం అవుతుందని ట్రెజరీ అధికారులు తెలిపారు. వీటిన్నింటిపై అవగాహన కల్పించేందుకుగాను ఇటీవల హనుమకొండ జిల్లా ఖజానా కార్యాలయంలో పెన్షన్ అసోసియేషన్ నాయకులు, పింఛన్దారులతో ట్రెజరీ శాఖ అధికారులు సమావేశం నిర్వహించారు.
టీయాప్ ఫోలియోతో సులువుగా..
పింఛన్దారుడు ట్రెజరీ కార్యాలయానికి వెళ్లకుండా జీవన్ ప్రమాణ్ ద్వారా మీ సేవా కేంద్రాల్లో గానీ, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన టీయాప్ ఫోలియో ఆండ్రాయిడ్ యాప్ ద్వారా గానీ లైఫ్ సర్టిఫికెట్ను సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకుగాను పింఛన్దారుడు ముందుగా ట్రెజరీ అధికారి వద్ద టీయాప్ ఫోలియో ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ట్రెజరీ అధికారి తమ వద్ద ఉన్న వివరాలు, రికార్డులను పరిశీలించి ఆమోదిస్తారు. అధికారి ఒకసారి ఆమోదించిన తర్వాత పింఛన్దారుడు సెల్ఫీ ద్వారా జీవన ధ్రువీకరణ పత్రాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పింఛన్దారుడు ఉన్న జీవిత కాలం అంతా సెల్ఫీ ద్వారా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించవచ్చు.