నయీంనగర్, సెప్టెంబర్ 5: విద్యార్థుల్లో నైపుణ్యాలను ఉపాధ్యాయులు గుర్తించి ప్రోత్సహించాలని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. హనుమకొండ అంబేద్కర్ భవన్లో సోమవారం హనుమకొండ, వరంగల్ జిల్లాల విద్యాశాఖల ఆధ్వర్యంలో గురుపూజోత్సవంలో భాగంగా ఉత్తమ టీచర్ పురస్కారాలు ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన మేయర్ జ్యోతిప్రజ్వలన తర్వాత మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా ప్రమాణాలు పెంపొందించిందని తెలిపారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తోందని పేర్కొన్నారు. వృత్తి ఎంతో గొప్పదని, ఈ వృత్తిలో ఉన్నవారు ఎంతో గౌరవంగా ఉండాలని సూచించారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలు అందచేసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ సుధీర్కుమార్, చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, కలెక్టర్లు రాజీవ్గాంధీ హనుమంతు, గోపి, వరంగల్ జిల్లా పరిషత్ చైర్మన్ వినయ్ కృష్ణ పాల్గొన్నారు.
పాఠశాలల్లో ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు
వరంగల్ చౌరస్తా, సెప్టెంబర్ 5: డాక్టర్ సర్వేపల్లి రాదాకృష్ణ జన్మదినం సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని 27, 36 డివిజన్ల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. 36వ డివిజన్ పరిధి చింతల్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, 27వ డివిజన్ పరిధిలోని ప్లాటినం జూబ్లీ పాఠశాలల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కాలనీలలో మౌలిక వసతులు కల్పిస్తాం
వరంగల్,సెప్టెంబర్ 5 : గ్రేటర్ కార్పోరేషన్ పరిధిలోని కాలనీలో మౌలికవసతులు కల్పిస్తామని గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య అన్నారు. సోమవారం కార్పొరేషన్ ముందు సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో నగర సమస్యలపై ధర్నా నిర్వహించారు. సుమారు గంట పాటు కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం అవరణలో బైఠాయించారు. ధర్నా ప్రాంతానికి కమిషనర్ ప్రావీణ్య వచ్చి వారి సమస్యలను విన్నారు. కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, పైన్లైన్ లాంటి కనీస వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం నాయకులు కమిషనర్కు వివరించారు. మురికివాడలో దోమలు వీపరీతంగా ఉన్నాయని కాలనీలో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారని విన్నవించారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రావీణ్య మాట్లాడుతూ కాలనీల్లో సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. దోమల నివారణకు ఫాగింగ్ చేపడుతామన్నారు. ప్రజలకు కనీస వసతులు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. కమిషనర్కు వినతిప్రతం అందజేసిన వారిలో సీపీఎం నాయకులు సింగారపు బాబు,ముక్కెర రామస్వామి,నలిగంటి రత్నమాల, ఎండీ బషీర్, యాదగిరి, గోవర్ధన్రాజు, జన్ను సురేశ్, అనిల్ అజయ్, పరంజ్యోతి, రాణి, యశోద, రజిని, విజయ, అరుణ, దేవీ, రేణుక, ఫజానా, షాహిదా, చైతన్య, ఊర్మిళ పాల్గొన్నారు.
ఘనంగా వినాయక నిమజ్జనోత్సవాలు..
దుగ్గొండి: మండల వ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు పూజలందుకునే గణనాథులను ఐదో రోజు భక్తుల ఆనందోత్సాహాల మధ్య పలు గ్రామాల్లో భక్తులు సోమవారం ఘనంగా నిమజ్జనం చేశారు. మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొల్పిన గణపతి విగ్రహాలు ఐదు రాత్రులు పూర్తి కావడంతో సోమవారం వినాయక మండపాల వద్ద వినాయకుడి చేతిలోని లడ్డ్డూలను వేలం పాటల ద్వారా భక్తులు దక్కించుకున్నారు. గిర్నిబావి గ్రామంలో ఎంజేపీటీలోని వినాయకుని నిమజ్జనంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని నిమజ్జనం చేశారు. మండలంలోని పలు గ్రామాల్లో వినాయక నిమజ్జనానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల్లో మహిళల కోలాటాలు, డప్పుచప్పుళ్లతో భక్తుల నృత్యాల మధ్య వినాయకులను తీసుకెళ్లి గ్రామల్లోని చెరువులో నిమజ్జనం చేశారు.