వరంగల్, నవంబర్ 24 : స్వచ్ఛ సర్వేక్షణ్-2022 ఫాస్ట్ మూవింగ్ హౌసింగ్ సిటీస్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ర్యాంకుల పంట పండింది. 3 లక్షల నుంచి 10 లక్షల జనాభా కలిగిన నగరాల కేటగిరీలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు వచ్చింది. 50 వేల నుంచి లక్ష జనాభా కలిగిన నగరాల కేటగిరీలో సౌత్ ఇండియా స్థాయిలో జనగామ మున్సిపాలిటీకి మూడో ర్యాంకు దక్కింది. 15 వేల జనాభా కలిగిన పట్టణాల కేటగిరీలో వర్ధన్నపేట మున్సిపాలిటీ సౌత్ ఇండియా స్థాయిలో రెండో ర్యాంకు దక్కించుకుంది. గురువారం కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ ఎఫైర్స్ మంత్రిత్వ శాఖ, జాయింట్ సెక్రటరీ, స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్ రూపా మిశ్రా స్వచ్ఛ సర్వేక్షణ్ ఫాస్ట్ మూవింగ్ సిటీస్ ర్యాంకులను ప్రకటించారు.
10 లక్షల జనాభా కలిగిన నగరాల కేటగిరీలో గ్రేటర్ వరంగల్ మూడో ర్యాంకు, రెండో ర్యాంకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ నగరానికి దక్కింది. 2021 సంవత్సరంలో గ్రేటర్ వరంగల్ స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలో 155వ ర్యాంకు సాధించగా, 2022 సంవత్సరంలో 62వ ర్యాంకు సాధించి తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. ఇంటింటా చెత్త సేకరణ, రోడ్ల శుభ్రత, సమర్థవంతంగా మరుగుదొడ్ల నిర్వహణ, మార్కెట్ల పరిశుభ్రత, రెసిడెన్సీ ప్రాంతాలు, మురుగు కాల్వ పరిశుభ్రత అంశాలను పరిగణనలోకి తీసుకొని సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ ఎఫైర్స్ మంత్రిత్వ శాఖ ఈ ర్యాంకులను ప్రకటించింది. ఫాస్ట్ మూవింగ్ సిటీస్లో ర్యాంకులు సాధించిన నగరాల మేయర్లను సన్మానించాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
మూడో ర్యాంకు రావడం సంతోషం..
వరంగల్ నగరం స్వచ్ఛ సర్వేక్షణ్ ఫాస్ట్ మూవింగ్ సిటీస్ లో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించడం సంతో షంగా ఉంది. స్వచ్ఛ సర్వేక్షణ్లో వచ్చే ఏడాది మరింత మెరుగైన ర్యాంకు సాధించేందుకు కృషి చేస్తాం. ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ మూడు సాధించాం. మానవ వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంట్తో పాటు మరుగుదొడ్ల నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించడం వల్ల స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలో గతం కంటే మెరుగైన ర్యాంకు సాధించాం. అధికారులు, కార్పొరేటర్ల సహకారంతో మంచి ర్యాంకు సాధ్యమైంది.
– గుండు సుధారాణి , మేయర్