వరంగల్, నవంబర్ 25: అభివృద్ధిని వికేంద్రీకరించి అన్ని ప్రాంతాలకు సమానంగా ఫలాలు అందేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో గ్రేటర్ వరంగల్ సమగ్రాభివృద్ధికి బల్దియా అధికారులు పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. స్మార్ట్సిటీ నిధులతో నగరంలోని ప్రధాన రహదారులతోపాటు ఎస్టీపీలు, పార్కుల అభివృద్ధి, గ్రంథాలయాల నవీకరణ పనులు సాగుతుండగా, మరో వైపు పట్టణప్రగతి, జనరల్ ఫండ్, ప్రత్యేక నిధులతో విలీన గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తున్నారు. వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలతోపాటు వర్ధన్నపేట, పరకాల, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గాల పరిధిలోని 42 విలీన గ్రామాల్లో సమాంతరంగా అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేశారు. రూ. 2306.97 కోట్ల స్మార్ట్సిటీ నిధులతో నగరంలోని రెండు నియోజవర్గాల్లో అభివృద్ధి ప్రణాళికలు చేశారు. పట్టణప్రగతి, జనరల్ ఫండ్, ఎస్డీఎఫ్కు చెందిన రూ. 427.41 కోట్లతో విలీన గ్రామాల్లో అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను పటిష్టపరిచేలా పనులు చేపట్టారు. స్మార్ట్సిటీ నిధులతో నగర ప్రధాన రహదారులను స్మార్ట్గా తీర్చిదిద్దుతున్నారు.
స్మార్ట్గా నగరం..
రాబోయే రోజుల్లో నగరం స్మార్ట్గా కనిపించనుంది. పెద్ద ఎత్తున స్మార్ట్సిటీ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు. దశాబ్దాల కాలంగా గుంతలుగా ఉన్న రోడ్లు స్మార్ట్సిటీ నిధులతో కొత్తరూపును సంతరించుకుంటున్నాయి. విశాలమైన రోడ్లు, పక్కన సైకిల్ ట్రాక్, దాని పక్కనే అందమైన పూలచెట్లు.. ఇలా నగరంలోని ప్రధాన రహదారులను స్మార్ట్గా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే కొన్ని రోడ్ల పనులు తుది దశకు చేరుకున్నాయి. మరికొన్ని రహదారుల పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని నాలుగు స్మార్ట్రోడ్ల పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. హనుమకొండ బస్స్టేషన్ నుంచి మచిలీబజార్ మీదుగా అలంకార్ జంక్షన్ కలిపే రహదారి పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. మరోవైపు తూర్పు నియోజకవర్గంలోని 14 ప్రధాన రహదారులను సుమారు రూ. 136.29 కోట్లతో స్మార్ట్రోడ్లుగా అభివృద్ధి చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో తూర్పు నియోజకవర్గంలోని అన్ని ప్రధాన రహదారులు స్మార్ట్గా మారనున్నాయి. ఇప్పటికే పలు రహదారుల పనులు పురోగతిలో ఉన్నాయి.
రూ. 427 కోట్లతో విలీన గ్రామాల అభివృద్ధి
గ్రేటర్ వరంగల్లో విలీనమైన 42 గ్రామాల్లో రూ. 427.41 కోట్లతో అభివృద్ధి పనులకు బల్దియా అధికారులు ప్రణాళికలు చేశారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, పైప్లైన్ వ్యవస్థ, శ్మశాన వాటికలు, పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. రూ. 427.41 కోట్లతో 2690 పనులకు ప్రణాళికలు చేశారు. అందులో ఇప్పటి వరకు రూ. 176.62 కోట్లతో చేపట్టిన 1851 పనులు పూర్తయ్యాయి. రూ. 97.59 కోట్లతో చేపట్టిన 183 అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయి. రూ.56.94 కోట్లతో చేపట్టనున్న 183 పనులు టెండర్ దశలో ఉన్నాయి. మరో రూ.11.94 కోట్లతో చేపట్టిన 62 పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయి అగ్రిమెంట్ దశలో ఉన్నాయి. రూ. 84.30 కోట్లతో చేపట్టనున్న 411 అభివృద్ధి పనులు త్వరలోనే మొదలు కానున్నాయి. మరికొన్ని నెలల్లో విలీన గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి కానున్నాయి. ఇప్పటికే విలీన గ్రామాలు ఎల్ఈడీ వెలుగులతో జిగేల్మంటున్నాయి.
మార్కెట్లు, గ్రంథాలయాల నవీకరణ
స్మార్సిటీగా మారుతున్న గ్రేటర్ వరంగల్లోని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చే దిశగా అభివృద్ధి జరుగుతున్నది. గ్రేటర్లో రహదారులను స్మార్ట్గా అభివృద్ధి చేయడంలోపాటు పార్కులు, సమీకృత మార్కెట్లను అదేస్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు. పబ్లిక్ గార్డెన్ సుందరీకరణ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. దీంతోపాటు దశాబ్దాల కాలంగా అభివృద్ధికి నోచుకోని రీజినల్, సెంట్రల్ లైబ్రరీలను డిజిటలైజేషన్ చేశారు. శరవేగంగా విస్తరిస్తున్న వరంగల్ నగరం రాబోయే రోజుల్లో అభివృద్ధికి కేరాఫ్గా మారనుంది.