వర్ధన్నపేట, ఫిబ్రవరి 14: రోడ్డు నిర్మాణంలో అధికారులు నిబంధనలు పాటించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని కొత్తపల్లి ఆకేరువాగు బ్రిడ్జి నుంచి ఇల్లంద గ్రామ సమీపంలోని విద్యుత్ సబ్స్టేషన్ వరకు ఇటీవల బీటీరోడ్డు వేశారు. ఈ రోడ్డుకు ఇరువైపులా సైడ్బర్మ్లు వేయకపోవడంతో ఎదురెదురుగా వాహనాలు వచ్చే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏమరపాటుగా వాహనం నడిపితే అదుపు తప్పి పంట పొలాల్లో పడిపోయే పరిస్థితి నెలకొంది. దీనికితోడు పంట పొలాలకు వెళ్లే బాటలకు బీటీ రోడ్డు నుంచి ట్రాక్ట ర్లు, ఎడ్లబండ్లు వెళ్తుండడంతో నెల రోజులు కాకముందే రహదారి పాడవుతున్నది.
కేసీఆర్ ప్రభుత్వం ఆకేరువాగులో వర్షపు నీటిని నిల్వ చేయడంతోపాటు గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపర్చేందుకు బ్రిడ్జి, చెక్డ్యామ్తోపాటు కొత్తపల్లి నుంచి ఇల్లంద వరకు బీటీరోడ్డు నిర్మాణం కోసం రూ. 12 కోట్లు విడుదల చేసింది. ఇందులో భాగంగానే కొత్తపల్లి-ఇల్లంద సబ్స్టేషన్ వరకు మూడు కిలో మీటర్ల రోడ్డు నిర్మాణం కోసం అధికారులు రూ. 40 లక్షలు వెచ్చించి నెల రోజుల క్రితమే బీటీ వేశారు. ఈ రోడ్డు నిర్మాణం వల్ల వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిలోని ఇల్లంద నుంచి కొత్తపల్లి, ల్యాబర్తి గ్రామాలతోపాటు పర్వతగిరి, రాయపర్తి మండలాల్లోని ప్రజలకు దూరభారం తప్పే అవకాశం ఉంది. అయితే, రోడ్డును విస్తరించి బీటీ వేస్తే వాహనదారులకు సౌకర్యంగా ఉండేది. కానీ, అధికారులు వైడెనింగ్ చేపట్టకుండా రోడ్డు వేయడంతో ఇరుకుగా మారి వాహనదారులు నానా తంటాలు పడుతున్నారు. రోడ్డు ఎత్తుగా ఉండి పక్కనే ఉన్న పంట పొలాలు లోతట్టుగా ఉండడంతో వాహనాలు అదుపుతప్పితో లోతట్టు ప్రాంతంలో పడిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సైడ్బర్మ్లు వేయించాలని వాహనదారులు కోరుతున్నారు.
కొత్తపల్లి-ఇల్లంద రోడ్డుకు మొరం కొరత వల్ల సైడ్బర్మ్లు పోయడంలో జాప్యం జరుగుతున్నది. వర్షపు నీరు వెళ్లేందుకు కూడా అనువైన ప్రదేశాల్లో సీసీ పైపులు వేయించాం. రైతులు పొలాలకు వెళ్లే దారుల వద్ద బీటీ పాడవకుండా, ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా త్వరలోనే రోడ్డుకు ఇరువైపులా సైడ్బర్మ్లు నిర్మిస్తాం.