రోజు రోజుకూ పెరుగుతున్న
నిత్యావసర సరుకుల ధరలు
కూరగాయలు, పండ్లు కూడా అదేదారి..
పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపే కారణం
పేద, మధ్య తరగతి ప్రజల ఇబ్బందులు
అడ్డూఅదుపు లేకుండా పెరుగుతున్న నిత్యావసర ధరలతో పేద, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. నెల రోజులకు ముందున్న కూరగాయలు, పండ్ల రేట్లు ప్రస్తుతం అమాంతం రెట్టింపయ్యాయి. గతంలో రూ.80 నుంచి రూ.100 మధ్య ఉన్న వంట నూనె ప్యాకెట్ రూ. 200, రూ.10కి కిలో ఉన్న టమాట రూ.65కు చేరింది. ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కారణం కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలే కారణమని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోదీ సర్కారు తక్షణమే చమురు ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.
హనుమకొండ, మే 20 : నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. కూరగాయలు, సీజనల్ పండ్ల రేట్లు సైతం కొండెక్కడంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలతో భారం మోస్తున్న పేదలు పెరుగుతున్న ధలతో ఏమి కొనేటట్టు లేదంటున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం నిత్యావసర సరుకులపై పడుతోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నెల రోజులకు ముందున్న కూరగాయల ధరలు అమాంతం రెట్టింపయ్యాయి. నో‘టమాట’ రావడంలేదని దిగులుపడుతున్నారు. గతంలో వంద, రెండు వందలకు వచ్చే కూరగాయలకు ఇప్పుడు రూ. 500 ఖర్చు చేయాల్సి వస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలతోపాటు ఎండల తీవ్రత సైతం ధరల పెరుగుదలకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో రూ.80 నుంచి రూ.100 మధ్య ఉన్న ఆయిల్ ప్యాకెట్ రూ. 200, రూ.10కి కిలో ఉన్న టమాట రూ.65కు చేరింది. ఆకుకూరలు, కూరగాయలు సైతం కొనేపరిస్థితి లేదు. ఇక్కడ కూరగాయలు, ఆకు కూరలు అనుకున్న స్థాయిలో సాగు కాకపోవడం, ఎండలు ఎక్కువగా ఉండటం, ఇతర రాష్ర్టాలు, జిల్లాల నుంచి దిగుమతి చేసుకోవడంతో కూరగాయల ధరలు బాగా పెరుగుతున్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఈ వేసవిలో కూరగాయలు రావడమే చాలా తక్కువని, తప్పని పరిస్థితుల్లో అమ్మాల్సి వస్తుందని అంటున్నారు.
డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించాలి
కాజీపేట : కేంద్ర ప్రభు త్వం రోజు రోజుకు పెంచుతున్న డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరల పెంపును వెనక్కి తీసుకోకుంటే బతుకు భారమే. నిత్యావసర వస్తువులు ధరలు పెంచుతుండడంతో నానా ఇబ్బందులు పడుతు న్నాం. పేద, మధ్య తరగతి ప్రజలు బతడం కష్టమే. గ్యాస్లేని ఇంట్లో వంట చేయడం నరకయాతనే. గ్యాస్ధర నిత్యం పెరుగుతుండంతో ఇబ్బందులు పడుతున్నాం. – ఆమని, కాజీపేట
బతుకు భారంగా మారింది..
కాజీపేట : కేంద్ర ప్రభు త్వం ఎప్పడికప్పుడూ డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరల పెంపుతో పేదల బతుకులు దుర్భరంగా మారాయి. రవాణా చార్జీలు పెరిగి నిత్యవసర వస్తువులు, కూరగాయల తదితర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో అదనపు భారం పడుతుంది. ధరల పెంపుతో బతుకు భారంగా మారుతుంది. కేంద్రం చమురు ధరలు తగ్గించాలి.
– బీ నల్లా హైమావతి, గృహిణి