గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి
రాంకీ విల్లాస్, దయానందకాలనీలో పర్యటన
మిషన్ భగీరథ పైప్లైన్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు
వరంగల్ చౌరస్తా, మే 28: నగరంలోని అన్ని డివిజన్లలో మౌలిక వసతులు కల్పించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. 27వ డివిజన్ పరిధిలోని రాంకీ విల్లాస్, దయానందకాలనీలో శనివారం ఆమె పర్యటించారు. రాంకీ విల్లాస్లో మిషన్ భగీరథ పైపులైన్ ఏర్పాటుకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. వరంగల్ రైల్వేస్టేషన్ నుంచి రాంకీ విల్లాస్ రెండో గేటు వరకు సుమారు 750 మీటర్ల పొడవుతో పైపులైన్ పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న కరెంట్ స్తంభాలను తొలగించి, కొత్త పోల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
దయానందకాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు. ఆమె వెంట కార్పొరేటర్ అనిల్కుమార్, గుండేటి నరేందర్, ఈఈలు రాజయ్య, శ్రీనివాస్, పబ్లిక్ హెల్త్ ఈఈ రాజ్కుమార్, డీఈ నరేందర్, ఏఈ సతీశ్ ఉన్నారు.