వరంగల్, మే 22 : బల్దియా అధికారులు పనితీరును మెరుగుపర్చుకోవాలని గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా సూచించారు. గ్రేటర్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన ఆయన తొలిరోజు అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిబద్ధతతో నగరాభివృద్ధికి కృషిచేయాలన్నారు. సోమవారం గ్రీవెన్స్ అనంతరం ఆయన అధికారులకు భవిష్యత్ కార్యాచరణ వివరించారు. ఈ సందర్భంగా పలు సూచనలు ఇచ్చారు. గ్రీవెన్స్లో వచ్చిన వినతుల పరిష్కారానికే మొదటి ప్రాధాన్యం ఇస్తానన్నారు. ఒకే రోజు గ్రీవెన్స్ అనుభవంతో తనకు ఇక్కడి పరిస్థితి అర్థమైందన్నారు. ఒకే సమస్యపై బాధితులు నెలల తరబడి గ్రీవెన్స్కు వస్తున్నారన్నారు. చిన్న, చిన్న సమస్యలపై అనేక సార్లు గ్రీవెన్స్ వస్తుంటే ప్రజలకు నమ్మకం పోతుందన్నారు. ఈ పరిస్థితిని మార్చాలన్నారు. గ్రీవెన్స్లో వినతి, ఫిర్యాదు వచ్చిన వెంటనే సంబంధిత అధికారి క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి, పరిష్కరించాలన్నారు. గ్రీవెన్స్ వినతుల్లో ఎక్కువగా టౌన్ప్లానింగ్ దరఖాస్తులే పెండింగ్ ఉన్నాయన్నారు. ఎప్పటికప్పుడు వినతులను పరిష్కరించాలని సూచించారు.
విభాగాల వారీగా పెండింగ్ దరఖాస్తులపై సమీక్ష నిర్వహించి, పరిష్కరించాల్సిన బాధ్యత వింగ్ అధికారులదే అని ఆయన స్పష్టం చేశారు. ఫిర్యాదుదారుడు పదేపదే గ్రీవెన్స్కు రాకుండా లిఖిత పూర్వకంగా జవాబు పంపించాలని సూచించారు. కాగా, కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, పెండింగ్ పనులు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమగ్ర నివేదికతో సిద్ధంగా ఉండాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లో నివేదక సిద్ధం చేయాలన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించిన నివేదికను విభాగాల వారీగా రూపొందించాలన్నారు. రెండేళ్లుగా విభాగాల వారీగా సాధించిన ప్రగతి, నిర్ధేశించుకున్న లక్ష్యాలు నివేదికలో పొందుపర్చాలని సూచించారు. వారం రోజుల్లో విభాగాల వారీగా సమీక్ష నిర్వహిస్తానని ఆయన తెలిపారు. అలాగే, విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభకనబర్చిన ఉద్యోగులకు ప్రతి నెలా ప్రోత్సాహకాలు అందచేస్తామని కమిషనర్ అన్నారు. వింగ్, సర్కిల్, డివిజన్ల వారీగా ఉత్తమ ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పారు. ప్రతిభగల ఉద్యోగులకు ప్రత్యేక గుర్తింపు ఉంటుదన్నారు.
అందరి సహకారంతో నగరాభివృద్ధి
ఉద్యోగులందరి సహకారంతో నగరాభివృద్ధికి కృషి చేస్తామని కమిషనర్ అన్నారు. మహా నగరంలో చేపడుతున్న, కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిరంతరం అభివృద్ధి పనులను అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.
బల్దియా గ్రీవెన్స్లో వినతుల స్వీకరణ
గ్రీవెన్స్లో బాధితులు నుంచి స్వీకరించిన వినతులు, ఫిర్యాదులను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా సూచించారు. సోమవారం గ్రీవెన్స్లో బాధితుల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. అందరి సమస్యలను ఓపికగా విన్నారు. త్వరగా పరిష్కరిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే గ్రీవెన్స్ నిర్వహించారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు వినతులు స్వీకరించారు. నగరంలో కుక్కలు, కోతుల బెడద నివారించాలని పౌర స్పందన వేదిక ప్రతినిధులు నల్లెల రాజయ్య, గోనెల దేవేందర్ గ్రీవెన్స్ హాల్ ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపి, అనంతరం కమిషనర్ను కలిసి వినతి పత్రం అందచేశారు. గ్రీవెన్స్లో మొత్తం 65 వినతులు వచ్చాయి. కాగా, గ్రీవెన్స్కు వచ్చే దివ్యాంగుల కోసం వెంటనే వీల్చైర్ ఏర్పాటు చేయాలని కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. బాధితుల కోసం మౌలిక వసతులు కల్పించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్లు రవీందర్ యాదవ్, అనీసుర్ రషీద్, ఎస్ఈలు కృష్ణారావు, ప్రవీణ్ చంద్ర, సీఎంహెచ్వో డాక్టర్ రాజేశ్, సిటీ ప్లానర్ వెంకన్న, సీహెచ్వో శ్రీనివాసరావు, డిప్యూటీ కమిషనర్లు జోనా, శ్రీనివాస్రెడ్డి, బయాలాజిస్ట్ మాధవరెడ్డి, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.