పాలకుర్తిలో బుధవారం నిర్వహించిన మెగా జాబ్మేళా ఆ నియోజకవర్గ యువతకు కొలువుల పండుగను తీసుకొచ్చింది. వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కడంతో వారిలో సంతోషం వెల్లివిరుస్తోంది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చొరవతో డీఆర్డీఏ, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్, ఈజీఎంఎంల సంయుక్తాధ్వర్యంలో ఏర్పాటుచేసిన మెగా జాబ్మేళాకు విశేష స్పందన వచ్చింది. వివిధ ప్రాంతాల నుంచి 4వేలకు పైగా ఉద్యోగార్థులు తరలిరాగా, 80 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూ చేసి 2,434 మందిని ఎంపికచేయగా, మంత్రి ఎర్రబెల్లి, కలెక్టర్ శివలింగయ్య వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే తన లక్ష్యమని.. సీఎం కేసీఆర్ పాలనలో యువతకు ఉద్యోగ అవకాశాలు పెరిగాయన్నారు. ఈ నెల 25న తొర్రూరులో మరో మెగా జాబ్మేళా ఉంటుందని ఆయన వెల్లడించారు.
పాలకుర్తి రూరల్, సెప్టెంబర్ 20 : పాలకుర్తి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే తన లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం జనగామ జిల్లా పాలకుర్తి మండలకేంద్రంలోని బృందావన్ గార్డెన్లో డీఆర్డీఏ, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్, ఈజీఎంఎం(ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్)ల సంయుక్త ఆధ్వర్యంలో మెగా జాబ్మేళా నిర్వహించగా కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. నియోజకవర్గంలోని 4,180మంది యువతీ యువకులు(నిరుద్యోగ) తరలివచ్చారు. ఈ జాబ్మేళాలో 80 కంపెనీల ప్రతినిధులు హాజరుకాగా 2,434వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. తమకున్న అర్హతలతో ఆయా కంపెనీల ఇంటర్వ్యూల్లో పాల్గొని కొలువును సొంతం చేసుకున్నారు.
నిరుద్యోగులకు పెరిగిన అవకాశాలు
జనగామ జిల్లాతో పాటు పాలకుర్తి నియోజకవర్గ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతోనే మెగా జాబ్మేళా నిర్వహించామని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. బీఆర్ఎస్ సర్కారు పాలన అద్భుతమని.. సీఎం చంద్రశేఖరరావు, మంత్రి కేటీఆర్ల చొరవతోనే రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు. కేసీఆర్ సీఎం పదవి చేపట్టిన నాటి నుంచి లక్షా 50వేల ఉద్యోగాలు కల్పించినట్లు పేర్కొన్నారు. మరో లక్ష ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశామని చెప్పారు. ఐటీ రంగంలో ప్రపంచమే హైదరాబాద్ వైపు చూస్తున్నదన్నారు. హైదరాబాద్ అంటేనే ఐటీ రంగానికి చిరునామాగా మారిందన్నారు.
బెంగళూర్కు దీటుగా హైదరాబాద్ ఎదిగిందన్నారు. అలాగే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఐటీని విస్తరించేందుకు మంత్రి కేటీఆర్ ఎంతో కృషిచేస్తున్నారని.. ఫలితంగా వరంగల్, కరీంనగర్ లాంటి నగరాలకు ఐటీ కంపెనీలు వచ్చాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలను ఏర్పాటుచేసిందని, ఈమేరకు యువత నైపుణ్యాలు పెంచుకోవాలన్నారు. ప్రతిభ ఉన్న యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు తప్పక లభిస్తాయన్నారు. జీతం ముఖ్యం కాదని జీవితం ముఖ్యమన్నారు. ప్రతిభ ఉంటే జీతాలు పెరుగుతాయన్నారు. చిన్న జీతాలని కుంగిపొవద్దని సూచించారు.
పాలకుర్తి యువతకు అండగా ఉంటానన్నారు. కరోనా లాంటి కష్టకాలంలోనూ ఆదుకున్నానని మంత్రి ఎర్రబెల్లి గుర్తుచేశారు. నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణ సెంటర్లను ఏర్పాటు చేశానన్నారు. సుమారు 1000మందికి ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారని చెప్పారు. ఎర్రబెల్లి ట్రస్టు ద్వారా నియోజకవర్గంలోని 10వేల మంది మహిళలకు ఉచిత కుట్టుమిషన్ శిక్షణ ఇప్పించానన్నారు. వారికి టెక్స్టైల్ పార్కులో ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. యువత స్వయంకృషితో ఎదగాలన్నారు. ఉన్నత ఆశయంతో ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. తాను చిన్నతనం నుంచే రాజకీయాల్లోకి రావాలనే ఆశయంతో ఉన్నానని చెప్పారు. యువత స్వలాభం కోసం కాకుండా సమాజ సేవలో పాలుపంచుకోవాలని సూచించారు. నిరుద్యోగ యువత ఉద్యోగం సాధించి తల్లిదండ్రుల కలను సాకారం చేయాలని ఆకాంక్షించారు. ఈ నెల 25న తొర్రూరులో మరో జాబ్మేళాను నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
కార్యక్రమంలో పీఆర్ జాయింట్ కమిషనర్ ప్రదీప్శెట్టి, అదనపు కలెక్టర్లు రోహిత్సింగ్, వి సుహాసిని, డీఆర్డీవో గూడూరు రాంరెడ్డి, డీపీవో రంగాచారి, జడ్పీ సీఈవో అనిల్కుమార్, ఆర్డీవో వాసం రామ్మూర్తి, ఏపీడీ ఎండీ నూరోద్దీన్, ఏసీపీ డీ రఘుచందర్, జీసీసీ మాజీ చైర్మన్ దరావత్ గాంధీనాయక్, ఎంపీపీలు నల్లా నాగిరెడ్డి, దరావత్ జ్యోతి, జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పసునూరి నవీన్, సిందె రామోజీ, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ వీరమనేని యాకాంతారావు, వసంత, ఎంపీడీవో వనపర్తి ఆశోక్కుమార్, తహసీల్దార్ టీ వెంకటేశం, బీ ఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, డాక్టర్ మేడారపు సుధాకర్ పాల్గొన్నారు.
మొదట లెక్చరర్గా పనిచేశా..
జాబ్మేళా సందర్భంగా జనగామ కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య తన ఉద్యోగ అనుభవాలను యువతతో పంచుకున్నారు. కలెక్టర్గా ఎదిగిన తీరును వివరించి వారిలో స్ఫూర్తి నింపారు. ‘నేను నేరుగా కలెక్టర్ను కాలేదు.. నాలుగైదు ఉద్యోగాలు చేసిన తర్వాతనే జిల్లా కలెక్టర్ ఉద్యోగానికి సెలక్ట్ అయ్యాను. నేను మొదట ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్గా పనిచేశా. ప్రతి ఒక్కరిలో ప్రతిభ ఉంటుంది. అవకాశాలను అందిపుచ్చుకుంటే ఉద్యోగం అదే వస్తుంది. యువతను ప్రోత్సహిస్తున్న ఘనత మంత్రి ఎర్రబెల్లికే దక్కుతుంది. ఉచి త కోచింగ్ శిక్షణలతో యువతకు బాసటగా నిలుస్తున్నారు. మెగా జాబ్మేళాను యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలి. 80 కంపెనీలు ఒకే చోటకు వచ్చి ఉద్యోగాలు కల్పించడం అభినందనీయం’.
– శివలింగయ్య, జనగామ కలెక్టర్
మేళాను సద్వినియోగం చేసుకోవాలి
నియోజకవర్గ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నిరంతరం పాటుపడుతుంటారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, కలెక్టర్ సహకారంతో ఎర్రబెల్లి ట్రస్టు చొరవతో మెగా జాబ్మేళా ఏర్పాటుచేశాం. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగం కోసం కాకుండా ప్రైవేట్ ఉద్యోగాలను సైతం ఎంపిక చేసుకోవాలి. జాబ్మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి.
– ఎర్రబెల్లి ఉషా దయాకర్రావు, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్
జాబ్ రావడం చాలా సంతోషంగా ఉంది
నేను ఉద్యోగం కోసం కొంతకాలంగా ఎదురుచూస్తున్నా. ఇంతలో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్, డీఆర్డీఏ ఆధ్వర్యంలో పాలకుర్తిలో మెగా జాబ్మేళా పెడుతున్నారని తెలిసింది. వెంటనే నేను, నా స్నేహితులతో కలిసి వచ్చాను. కంపెనీ వాళ్లు ఇంట ర్వ్యూ చేశారు. నేను అనుకున్నట్లు ఉద్యోగానికి సెలక్ట్ అయినట్లు చెప్పారు. నాకు చాలా సంతోషం అనిపించింది. నాకు అపోలో ఫార్మసీ కంపెనీలో జాబ్ వచ్చింది. నెలకు 17వేలు వేతనం. మా యువత కోసం జాబ్మేళా నిర్వహించి ఉద్యోగం వచ్చేలా చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సార్, ఉష మేడమ్కు చాలా చాలా థ్యాంక్స్.
– ఈ.అన్నపూర్ణ, సింగరాజుపల్లి
ఎర్రబెల్లి సార్ సహకారం వల్లే..
నిరుద్యోగ యువత కోసం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సార్ చేస్తున్న కృషి మరవలేనిది. నియోజకవర్గంలోని నిరుద్యోగుల కోసం గతంలో కూడా అనేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేలా చేశారు. జాబ్మేళాలో పాల్గొని నేను రామ్రాజ్ కాటన్ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికయ్యాను. నెలకు రూ.12వేలు వేతనం. మొదటిసారి మా దగ్గరికి వచ్చి మమ్ములను ఉద్యోగాలకు ఎంపిక చేసుకొని తీసుకెళ్లడం ఆనందంగా ఉంది. నాకు ఉద్యోగం వచ్చేలా చొరవ చూపిన దయాకర్రావు సారుకు జీవితాంతం రుణపడి ఉంటా.
– కుంట రాజు, బమ్మెర