దేవరుప్పుల, జూలై 24 : అన్నివర్గాల ప్రజల సంక్షేమమే తెలంగాణ సర్కారు ధ్యేయమని, ఇందుకనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన అందిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ప్రణాళికాబద్ధమైన కార్యక్రమాలతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, సంపద పెరగడంతోపాటు రైతుల ఆస్తుల విలువ 20రెట్లు అయ్యిందని తెలిపారు. మండల కేంద్రంలోని తిరుమల గార్డెన్లో సోమవారం ఉపాధిహామీ కూలీలతో నిర్వహించిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. సుమారు రూ.2కోట్లతో పాలకుర్తి నియోజకవర్గంలోని 49వేల కుటుంబాలకు చెందిన 79వేల మంది ఉపాధి హామీ కూలీలకు ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.260 విలువైన టిఫిన్ బాక్స్, స్టీల్ వాటర్ బాటిల్, బ్యాగ్ అందజేస్తున్నట్లు తెలిపారు.
ఉపాధి కూలీలను పనులు చేస్తుండగా గుడ్డలో, పగిలిన బాక్సుల్లో అన్నం తెచ్చుకోవడం పలుమార్లు చూశానని, అందుకే వారికి ఈ కిట్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఇదే సందర్భంగా కూలీలకు ఈ కిట్లు అందించి వారి సమక్షంలోనే ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో పల్లె ప్రగతి అమలు, ఇంటింటికీ మిషన్ భగీరథ నీటి సరఫరాతో సీజనల్ వ్యాధులకు చెక్ పడిందన్నారు. లభ్యత వల్ల నేడు రైతులు రాజులయ్యారని, వారి ఆస్తుల విలువలు 20రెట్లు పెరిగిందన్నారు. రైతుబంధు, ఉచిత విద్యుత్, సాగునీటితో పంటల దిగుబడి పెరిగి నేడు తెలంగాణ దేశంలోనే రైస్ బౌల్గా పేరొందిందన్నారు. తరి, ఎలుగటి పంటలు పండిస్తూ రైతు కుటుంబాలు సుభిక్షంగా ఉన్నాయన్నారు.
ఎర్రబెల్లి ట్రస్ట్ ద్వారా పేదలకు అనేక సేవలు
గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగిన తాను పేద ప్రజల స్థితిగతులు తెలిసినవాడినని మంత్రి అన్నారు. ప్రభుత్వ సేవలతోపాటు ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి, ఎన్ఆర్ఐలు, దాతల ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. రూ.20కోట్లతో మందికి ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించడంతో ప్రారంభమై క్రమంగా సేవలు విస్తరించినట్లు పేర్కొన్నారు. ప్రజలకు ఫ్లోరైడ్ కష్టాలు తప్పించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల్లో ప్రజల భాగస్వామ్యంతో వేలాది మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి, శుద్ధి చేసిన నీరు అందించినట్లు వివరించారు. వరంగల్లోని ఎంజీఎం దవాఖానలో స్థితిగతులను చూసి ట్రస్ట్ ద్వారా విదేశాల నుంచి సేకరించిన విరాళాలు రూ.5కోట్లతో మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. కరోనా సమయంలో అన్ని వర్గాలకు ఆర్థిక, వైద్య, అంబులెన్స్ సేవలు, పేదలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించానని, కరోనా నివారణలో 40లక్షల డోసులు ఆనందయ్య మందును ప్రజలకు పంపిణీ చేసినట్లు చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు రావడంతో పేద విద్యార్థులకు నెలరోజుల పాటు ఉచిత శిక్షణ,మెటీరియల్ పంపిణీ, ఉచిత భోజనం అందించినట్లు వివరించారు. సమావేశానికి హాజరైన వెయ్యి మంది ఉపాధిహామీ కూలీలకు భోజన సంచులు మంత్రి ఎర్రబెల్లి చేతులమీదుగా పంపిణీ చేశారు. అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, డీఆర్డీవో రాంరెడ్డి, అదనపు డీఆర్డీవో నూరుద్దీన్, ఎంపీపీ బస్వ సావిత్రి, దేవరుప్పుల, కామారెడ్డిగూడెం సర్పంచ్లు ఈదునూరి రమాదేవి, బిళ్ల అంజమ్మ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తీగల దయాకర్, మండల ప్రజాప్రతినిధులు పల్లా సుందరరాంరెడ్డి, బస్వ మల్లేశ్, చింత రవి, కొల్లూరు సోమయ్య, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ ఈదునూరి నర్సింహరెడ్డి, గ్రామ కోఆర్డినేటర్ కోతి పద్మ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కృష్ణమూర్తి, డైరెక్టర్ కొత్త జలేందర్రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు కుతాటి నర్సింహులు, తాటిపల్లి మహేశ్, ఎంపీడీవో సురేశ్కుమార్, ఏపీఎం వెంకట్రెడ్డి, ఏపీవో శ్రీనివాస్, నాయకులు జోగు సోమనర్సయ్య, కాసీం, ఏల సుందర్, గడ్డం రాజు, నవీన్, మధు, రమేశ్ పాల్గొన్నారు.