నెలవారీ విద్యుత్ బిల్లులు తగ్గించుకునేందుకు గ్రామ పంచాయతీలు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాయి. స్ట్రీట్ లైట్లకు సోలార్ కరంటు వినియోగంపై దృష్టి సారిస్తున్నాయి. గీసుగొండ మండలంలోని మరియపురం జీపీ వీధి దీపాలకు సౌర విద్యుత్ను వినియోగిస్తూ జిల్లాలోని ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. రెండు త్రీ కేడబ్ల్యూ యూనిట్లు ఏర్పాటు చేసి 149 వీధి లైట్లకు కరంటు సరఫరా చేస్తున్నది. నెట్ మీటరింగ్తో విద్యుత్ ఉత్పత్తి, వినియోగం నమోదు చేస్తుండగా, నెలనెలా కరంటు బిల్లు రూ.9 వేల నుంచి రూ.2 వేలకు దిగివచ్చినట్లు సర్పంచ్ అల్లం బాలిరెడ్డి తెలిపారు. సంవత్సరానికి సుమారు రూ. లక్ష వరకు ఆదా అవుతుందని చెప్పారు. అలాగే, గృహావసరాలకు యూనిట్లు ఏర్పాటు చేసుకునే పేదలకు ఒక్కొక్కరికి తన సొంత డబ్బు రూ. 20 వేలు అందజేస్తానని ప్రకటించారు.
– వరంగల్, ఫిబ్రవరి 25(నమస్తేతెలంగాణ)
వరంగల్, ఫిబ్రవరి 25(నమస్తేతెలంగాణ) : విద్యుత్ వినియోగం పెరగడం, వెరసి ఆర్థిక భారం పడుతున్న నేపథ్యంలో సౌర విద్యుత్ ఉత్పత్తి, వినియోగం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే అనేక మంది వినియోగదారులు సోలార్ యూనిట్లను ఏర్పాటు చేసి అవసరాలు తీర్చుకుంటున్నారు. ప్రభుత్వం కూడా సౌర విద్యుత్ ఉత్పత్తికి వినియోగదారులను ప్రోత్సహిస్తున్నది. యూనిట్ల ఏర్పాటు కోసం స్వయం సహాయక సంఘా(ఎస్హెచ్జీ)ల సభ్యులకు సబ్సిడీతో పాటు రుణం సైతం ఇస్తున్నది. ఈ క్రమంలో గ్రామ పంచాయతీలూ సౌర విద్యుత్ ఉత్పత్తికి ముందుకొస్తున్నాయి. వీధి దీపాల నిర్వహణకు సోలార్ యూనిట్లను ఏర్పాటు చేయడంపై నజర్ పెట్టాయి. తద్వారా గ్రామ పంచాయతీపై ఆర్థిక భారం తగ్గుతుందని భావిస్తున్నాయి. గీసుగొండ మండలంలోని మరియపురం గ్రామ పంచాయతీ ఇటీవల సోలార్ యూనిట్లను ఏర్పాటు చేసింది.
సౌర విద్యుత్ ఉత్పత్తితో విజయవంతంగా స్ట్రీట్ లైట్లను నిర్వహిస్తున్నది. వీధి దీపాల నిర్వహణ కోసం జిల్లాలో సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసిన తొలి జీపీ మరియపురం కావడం విశేషం. ఇప్పటికే మరియపురం ఉత్తమ గ్రామ పంచాయతీగా ప్రశంసలు అందుకుంటున్నది. పంచాయతీ పరిధిలో 248 ఇండ్లు ఉండగా, 760 మంది జనాభా ఉంది. గ్రామంలో 149 వీధి లైట్లు ఉన్నాయి. ఇటీవల వరకు వీటికి ఐదు మీటర్ల ద్వారా విద్యుత్ సరఫరా జరిగేది. జీపీ కార్యాలయం నిర్వహణకు ప్రత్యేకంగా ఒక మీటరు పనిచేస్తున్నది. ఈ ఆరు మీటర్ల ద్వారా విద్యుత్ వినియోగానికి మరియపురం పంచాయతీ ప్రతి నెలా రూ.8 నుంచి రూ.9 వేల వరకు బిల్లు చెల్లించింది. ఈ నేపథ్యంలో సోలార్ విద్యుత్తో వీధి లైట్లు నిర్వహిస్తే ఆర్థిక భారం తగ్గుతుందని సర్పంచ్ అల్లం బాలిరెడ్డి ప్రతిపాదించారు. పాలకవర్గం, అధికారుల ఆమోదంతో తన ప్రతిపాదనను ఆచరణలోకి తెచ్చారు.
రెండు యూనిట్ల ఏర్పాటు..
మరియపురం గ్రామాన్ని మోడల్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న సర్పంచ్ పలు సందర్భాల్లో అభివృద్ధి పనుల కోసం సొంత డబ్బు వెచ్చిస్తున్నారు. ఈ క్రమంలో పంచాయతీ నిధుల నుంచి కాకుండా తన సొంత డబ్బు రూ.4.20 లక్షలు వెచ్చించి ఇటీవల త్రీ కిలోవాట్(కేడబ్ల్యూ)ల సోలార్ యూనిట్లు రెండు ఏర్పాటు చేశారు. వీటిలో ఒకటి గ్రామంలోని అంగన్వాడీ సెంటర్ భవనంపై, మరొకటి పశువుల దవాఖాన భవనంపై అమర్చారు.
అంగన్వాడీ సెంటర్ యూనిట్ ద్వారా 74, పశువుల దవాఖాన యూనిట్ ద్వారా 75 వీధి లైట్లకు విద్యుత్ సరఫరా జరిగేలా ఏర్పాట్లు చేశారు. గతంలో వీధి లైట్ల కోసం పనిచేసిన ఐదు మీటర్లలో మూడింటిని ఎన్పీడీసీఎల్కు సరెండర్ చేశారు. మిగతా రెండింటిని కొత్తగా ఏర్పాటు చేసిన సోలార్ యూనిట్ల వద్ద వినియోగిస్తున్నారు. నెట్ మీటరింగ్తో గ్రామంలోని 149 వీధి లైట్లు నిర్వహిస్తున్నారు. నెట్ మీటరింగ్ వినియోగంతో విద్యుత్ వాడకం, ఉత్పత్తి నమోదు అవుతుంది. నెలలో ఉత్పత్తి అవుతున్న సౌర విద్యుత్ కంటే ఎక్కువ వాడకం జరిగితే ఒక యూనిట్ కరంటుకు రూ.4.20 చొప్పున మరియపురం పంచాయతీ ఎన్పీడీసీఎల్కు బిల్లు చెల్లిస్తుంది. ప్రస్తుతం బిల్లు రూ.2 వేలకు దిగివచ్చింది.
ఏడాదికి రూ.లక్ష ఆదా.. అల్లం బాలిరెడ్డి, సర్పంచ్, మరియపురం
సౌర విద్యుత్ ఉత్పత్తితో జీపీకి ఏడాదికి సుమారు రూ.లక్ష ఆదా కానుంది. సోలార్ యూనిట్లను ఏర్పాటుకు ముందు వీధి లైట్ల నిర్వహణ కోసం ప్రతి నెలా రూ.9 వేల వరకు బిల్లు చెల్లించాం. ఇప్పుడు అది రూ.2 వేలకు పడిపోయింది. సౌర విద్యుత్ ఉత్పత్తి, వినియోగం, మిగులును ఎన్పీడీసీఎల్ సర్దుబాటు చేస్తుంది. సోలార్ యూనిట్ల ఏర్పాటు కోసం పంచాయతీ వెచ్చించిన వ్యయం ఐదేళ్లలో జీరో అవుతుంది. గృహావసరాలకూ సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలను ప్రోత్సహిస్తున్నాం. ఇప్పటికే గ్రామంలో ఇరవై మంది రూ.1.42 లక్షల వ్యయంతో యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి ముందుకొచ్చారు. వీరికి ప్రభుత్వం ఒక్కో యూనిట్కు రూ.39 వేల సబ్సిడీ, రూ.1.03 లక్షల రుణం ఇవ్వనుంది. గ్రామంలో యూనిట్ల ఏర్పాటుకు ముందుకొచ్చే పేదలకు ఒక్కొక్కరికి రూ.20 వేల విరాళం అందజేస్తా.