చేప పిల్లల పంపిణీకి రెడీ
496 చెరువుల్లో పెంపకానికి మత్స్య శాఖ ప్రణాళిక
నాలుగు రిజర్వాయర్లలో రొయ్యల పంపిణీకి సన్నాహాలు
వందశాతం సబ్సిడీతో అందిస్తున్న ప్రభుత్వం
జయశంకర్ జిల్లాలో ఏటేటా పెరుగుతున్న మత్స్య సంపద
జయశంకర్ భూపాలపల్లి, జూన్ 23 (నమస్తేతెలంగాణ) : మత్స్యరంగానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో జవసత్వాలను చేకూర్చు తున్నది. మత్స్యకార సహకార సంఘాల బలోపేతంతో పాటు, ఆ కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి చేస్తున్నది. ఇందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉచిత చేప పిల్లల పంపిణీకి జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఈ ఏడాది 1.92 కోట్ల చేప పిల్లలు, నాలుగు రిజర్వాయర్లలో రొయ్యలు వదిలేందుకు నిర్దేశించింది. ఇందుకోసం 496 చెరువులు, మేడిగడ్డ, అన్నారం, గణప సముద్రం, భీంగణపూర్ జలాశయాలను మత్స్యశాఖ ఎంపిక చేసింది. వర్షాలు కురిసి చెరువుల్లోకి నీరు చేరగానే సీడ్ పంపిణీ ప్రక్రియను ప్రారంభించనుంది. ప్రభుత్వం ప్రతి ఏటా వంద శాతం సబ్సిడీపై చేప పిల్లలను పంపిణీ చేస్తున్నది. గత ఏడాది 1.25 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేయగా ఈ సారి అందనంగా 70 లక్షలకు పైగా పిల్లలు చెరువుల్లో పోయనున్నారు.
జయశంకర్ భూపాలపల్లి, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : కుల వృత్తులను ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ సర్కార్ మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి అండగా నిలుస్తూ ఏటా చెరువులు, కుం టల్లో ఉచితంగా చేప, రొయ్య పిల్లలను పంపిణీ చేస్తున్నది. జిల్లాలోని మత్స్య సహకార సంఘాలను బలోపేతం చేస్తున్నది. చేపలను విక్రయించడం ద్వారా ఆ వృత్తిపై ఆధారపడి జీవించే వారు ఆర్థికంగా ఎదిగేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి 100 శాతం సబ్సిడీపై చేప పిల్లల పం పిణీకి జిల్లా మత్స్యశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. వర్షకాలం సీజన్ ప్రారంభం అయిన నేపథ్యంలో 11 మండలాల పరిధిలోని 462 చెరువు ల్లో చేప పిల్లలు వదలనున్నారు. ఇందుకోసం ప్రతిపాదనలను సిద్ధం చేసిన మత్స్యశాఖ టెండర్ల ప్రక్రియ సై తం పూర్తి వేగవంతం చేస్తున్నది. 2022-23 సంవత్సరానికి 462 చెరువులు, 4 రిజర్వాయర్లలో 1.92 కో ట్ల చేప పిల్లలు వంద శాతం సబ్సిడీపై అందించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గత ఏడాది 430 చెరువుల్లో 1.25 కోట్ల పంపిణీ చేయగా ఈ ఏడాది అదనంగా 70 లక్షలకు పైగా చెరువుల్లో పోయనున్నారు.
వివిధ సైజుల్లో చేప పిల్లలు
జిల్లాలోని 462 చెరువుల్లో 35-40 మి.మి సైజ్ గల పిల్లలు 1.11 కోట్లు, నాలుగు రిజర్వాయర్లలో 80 లక్షల 80-100 మి.మి సైజ్ గల చేప పిల్లలు పం పిణీ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 33-40 మి.మి చేప పిల్లలకు 55 పైసల చొప్పున, 80-100 మి.మి పిల్లలకు 1.50 పైసల చొప్పున ప్రభుత్వం ఖర్చు చేసి చెరువుల్లో విడుదల చేయనున్నారు.
నాలుగు రిజర్వాయర్లలో రొయ్యలు
జిల్లాలోని మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ, అన్నారం, గణపురం మండలంలోని గణప సముద్రం, భూపాలపల్లి మండలంలోని భీంగణపూర్ రిజర్వాయర్లలో రొయ్యల పెంపకం చేపట్టనున్నారు. ఈ సంవత్సరం మొత్తం 1.92 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం.
కొత్త చెరువులపై సర్వే చేస్తున్నాం..
జిల్లాలో ఇప్పటికే గుర్తించిన చెరువులతో పాటు కొత్త చెరువులపై సర్వే చేస్తున్నాం. సర్వే అనంతరం జిల్లాలో ఉన్న మొత్తం చెరువుల సంఖ్యను పరిగణలోకి తీసుకొని చేప పిల్లల పంపిణీ చేపడుతాం.
– ఆర్ అవినాశ్, జిల్లా మత్స్యశాఖ అధికారి, జయశంకర్ భూపాలపల్లి