నర్సంపేటరూరల్, డిసెంబర్ 23: మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు ఆర్థిక సంస్కరణల పితామహుడు అని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పీవీ జన్మస్థలమైన లక్నేపల్లి గ్రామంలో శుక్రవారం నర్సింహారావు 18వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా పీవీ కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే పెద్ది, ఆర్డీవో శ్రీనివాసులు స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, పీవీ కుటుంబ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పీవీ నర్సింహారావు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నేత అని, మారుమూల గ్రామంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి దేశానికి ప్రధాని కావడం గర్వకారణమన్నారు. గతంలో దేశం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు పరిస్థితులను చక్కదిద్దేందుకు పీవీ అనేక సంస్కరణలు చేసి కాపాడారని గుర్తుచేశారు. అలాంటి మహానుభావుడి జ్ఞాపకార్థం మెమోరియల్ ట్రస్టు ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పీవీకి అరుదైన గౌరవాన్ని కల్పిస్తున్నారన్నారు. పీవీ జన్మించిన లక్నేపల్లి, పెరిగిన వంగర గ్రామాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తున్నదని వివరించారు. దేశం గర్వించదగిన వ్యక్తి పీవీ అని కొనియాడారు. ఆయన చేసిన ఆర్థిక సంస్కరణల ఫలితంగానే నాడు దేశం అప్పుల నుంచి బయటపడిందన్నారు. రాజకీయాల్లో మచ్చలేని వ్యక్తి పీవీనేనని, నిస్వార్థానికి, చిత్తశుద్ధికి నిలువెత్తు నిదర్శనం అని కొనియాడారు. గతంలో పీవీ చూపిన మార్గంలో ముందుకు సాగితే దేశం ప్రపంచంలోనే అభివృద్ధిలో ముందువరుసలో ఉండేదన్నారు. అనంతరం పీవీ కుమార్తె ఎమ్మెల్సీ సురభివాణీదేవి రచించిన పుస్తకాలతోపాటు నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ మోతె కళావతి, జడ్పీటీసీ కోమాండ్ల జయ, సర్పంచ్ గొడిశాల రాంబాబుగౌడ్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కొడారి రవన్న, ఎంపీటీసీ ఉల్లేరావు రజిత, డాక్టర్ లెక్కల విద్యాసాగర్రెడ్డి, మాడ్గుల రవీంద్రాశర్మ, పాత్కాల కొమ్మాలు, బగ్గి రాజు, బీఆర్ఎస్ నర్సంపేట పట్టణ అధ్యక్షుడు నాగెళ్లి వెంకటనారాయణగౌడ్, మోతె పద్మనాభరెడ్డి, కోమాండ్ల గోపాల్రెడ్డి పాల్గొన్నారు.
ఆర్థిక సంస్కరణల ఘనత పీవీదే..
దుగ్గొండి: మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు 18 వర్ధంతిని గిర్నిబావిలోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంజేపీటీ ప్రత్యేకాధికారి కూరోజు దేవేందర్తోపాటు ఉపాధ్యాయులు పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దేవేందర్ మాట్లాడుతూ దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన ఘనత పీవీకే దక్కిందన్నారు. బహుభాషా కోవిదుడిగా పేరు సంపాదించిన తొలి తెలుగువాడని కొనియాడారు. దక్షణ భారతదేశం నుంచి రెండో ప్రధానిగా పీవీ పని చేశారని గుర్తుచేశారు. యువత పీవీ అడుగుజాడల్లో నడువాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏటీపీ ప్రభాకర్, వార్డెన్ రాజు, ఉపాధ్యాయులు సుకుమార్, సోమారాణి, సురేశ్, కోటి, కిరణ్, రమేశ్, బషీర్, సుభాష్, కృష్ణమూర్తి, అనిల్, సునీత, అనిత, సతీశ్, ప్రేమలత, జూనియర్ అసిస్టెంట్లు బాలకొమురెల్లి, వెంకన్న పాల్గొన్నారు.