రైతులు ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నది. ప్రయోగాత్మకంగా నర్సంపేట శాసనసభ నియోజకవర్గంలో రూ.75 కోట్లతో పైలట్ ప్రాజెక్టును చేపట్టింది. రైతులకు యాబై శాతం సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు, యంత్రాలు, పనిముట్లు ఇవ్వనుండగా, ఇప్పటికే సీఎం కేసీఆర్ రూ.37.50 కోట్లు కేటాయించారు. ఇటీవలే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. మొత్తం 49 కంపెనీలు శుక్రవారం నుంచి నర్సంపేటలో తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. ఈ పథకం ద్వారా సుమారు 63 వేల మంది రైతులకు ప్రయోజనం కలుగనున్నది. ఆధునిక వ్యవసాయంలో రైతులను ప్రోత్సహించేందుకు డ్రోన్లను సబ్సిడీపై పంపిణీ చేయనుండడం రాష్ట్రంలో ఇక్కడే తొలిసారి కావడం విశేషం.
వరంగల్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నది. అడుగడుగునా అన్నదాతకు దన్నుగా నిలిచే దిశగా ముందుకు వెళ్తున్నది. దేశంలో మరే రాష్ట్రంలో లేని 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా పథకాల అమలు, మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు, రాయితీపై విత్తనాల సరఫరా, రుణమాఫీ వంటి మరెన్నో కార్యక్రమాలతో రైతన్నను వ్యవసాయంలో ప్రోత్సహిస్తున్నది. వీటికి తోడు తాజాగా వ్యవసాయ యంత్రీకరణ పథకాన్ని అమల్లోకి తెచ్చేందుకు అడుగులు వేస్తున్నది. ప్రయోగాత్మకంగా నర్సంపేట శాసనసభ నియోజకవర్గంలో రూ.75 కోట్లతో పైలట్ ప్రాజెక్టును చేపట్టింది. కొద్దినెలల క్రితం కురిసిన అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆర్థికంగా ఆదుకోవటానికి ఈ ప్రాజెక్టును రూపొందించింది. అధునాతన వ్యవసాయ పరికరాలు, పనిముట్లను 50 శాతం సబ్సిడీతో కర్షకులకు పంపిణీ చేయడం దీని ఉద్దేశ్యం.
మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ్దప్రాతిపదికన పైలట్ ప్రాజెక్టును అమలు చేయడానికి రూ.37.50 కోట్ల సబ్సిడీ నిధులనూ కేటాయించింది. ఈ ప్రాజెక్టు అమలుతో నర్సంపేట నియోజకవర్గం పరిధిలో సుమారు 63 వేల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుందని ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రకటించారు. అకాల వర్షాలతో రైతాంగానికి అపార నష్టం వాటిల్లింది. ఏడాది క్రితం మరెక్కడా లేని విధంగా నర్సంపేట నియోజకవర్గంలో అకాల వడగండ్ల వాన పడింది. పంటలతో పాటు సాగు నీరందించేందుకు వ్యవసాయ భూముల్లో రైతులు వేసిన డ్రిప్ ఇరిగేషన్, పీవీసీ పైపులు సైతం దెబ్బతిన్నాయి. గత మార్చి, ఏప్రిల్లోనూ ఇక్కడ అకాల వర్షాలు కురిశాయి. గాలి, వానకు మక్కజొన్న, పత్తి, మిర్చితో పాటు, పండ్లు, కూరగాయల పంటలు తుడిచిపెట్టుకపోయాయి. పంటలకు సాగు నీరందించేందుకు రైతులు అమర్చిన డ్రిప్ ఇరిగేషన్, పీవీసీ పైపులు మరోసారి పాడయ్యాయి. విద్యుత్తు మోటర్లదీ ఇదే పరిస్థితి. అకాల వర్షాలతో నర్సంపేట నియోజకవర్గంలోని రైతులకు కోలుకోలేని రీతిలో నష్టం జరిగింది. పంటతో పాటు సాగు నీరందించే పంపుసెట్లు, పైపులు, డ్రిప్ ఇరిగేషన్ దెబ్బతిన్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో సీఎం కేసీఆర్ గత మార్చి 23న ఈ నియోజకవర్గంలోని దుగ్గొండి మండలం అడవిరంగాపురం గ్రామాన్ని సందర్శించి అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి జరిగిన పంట నష్టాలను తెలుసుకున్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం ఇటీవల నిధులను విడుదల చేసింది. చెక్కుల రూపంలో ఈ పరిహారాన్ని రైతులకు పంపిణీ చేసే పనిలో ఉంది.
అకాల వర్షాల వల్ల పంటతో పాటు సాగు నీరందించే పరికరాలు కూడా దెబ్బతినడం వల్ల పెద్ద మొత్తంలో నష్టపోయిన నర్సంపేట నియోజకవర్గంలోని రైతులను ఆదుకోవడానికి వ్యవసాయ యంత్రీకరణ పథకం ద్వారా సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు, యంత్రాలు, పనిముట్లను అందజేయాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సీఎం కేసీఆర్ను కోరారు. ప్రత్యేకంగా రూ.75 కోట్లతో ఈ నియోజకవర్గానికి పైలట్ ప్రాజెక్టు మంజూరు చేయాలని పేర్కొన్నారు. ఆయన ప్రతిపాదనకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో నర్సంపేట నియోజకవర్గంలో వ్యవసాయ యంత్రీకరణ పథకం ద్వారా రైతులకు 50 శాతం సబ్సిడీపై అధునాతన వ్యవసాయ పరికరాలు, పనిముట్లను పంపిణీ చేయడానికి రూ.75 కోట్ల పైలట్ ప్రాజెక్టు అమలుకు కొద్దిరోజుల క్రితం ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఫలితంగా నర్సంపేట నియోజకవర్గంలోని రైతులకు ఈ ప్రాజెక్టు ద్వారా పీవీసీ పైపుల యూనిట్లు, టార్పాలిన్లు, ట్రాక్టర్లు, అగ్రికల్చర్ ట్రాన్స్పోర్టు వెహికిల్స్, వరి నాటు వేసే యంత్రాలు, కలుపు తీసే యంత్రాలు, రోటావేటర్లు, పవర్ టిల్లర్లు, పవర్ వీడర్లు, కరెంటు మోటర్లు, కాటన్ పికింగ్ యం త్రాలు, స్ప్రేయర్లు, హార్వెస్టింగ్ మిషన్లు, సీడ్ కమ్ ఫర్టిలైజర్ వేసే యంత్రాలు, డ్రిప్ ఇరిగేషన్, డ్రోన్లు తదితర పరికరాలు అందనున్నాయి. ఆధునిక వ్యవసాయంలో డ్రోన్లను సబ్సిడీపై పంపిణీ చేయనుండడం రాష్ట్రంలో ఇక్కడే తొలిసారి కానుండడం విశేషం. ఎమ్మెల్యే పెద్ది చొరవ, పట్టుదలతో మంజూరైన ఈ ప్రాజెక్టును వెంటనే అమలు చేయడానికి అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. 15 రోజుల్లో రైతులకు వ్యవసాయ పరికరాలు, యంత్రాలు పంపిణీ చేయాలనే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు డీఏఓ ఉషాదయాళ్ తెలిపారు.
రూ.75 కోట్ల పైలట్ ప్రాజెక్టు అమలు కోసం వ్యవసాయ పరికరాలు, యంత్రాలు, పనిముట్ల కొనుగోలుకు 9 మంది ఉన్నతాధికారులతో కొద్దిరోజుల క్రితం జిల్లా పర్చేజ్ కమిటీ(డీపీసీ) ఏర్పడింది. జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీవత్స చైర్మన్గా ఉన్న ఈ కమిటీలో డీఏఓ ఉషాదయాళ్ కన్వీనర్గా, డీఆర్డీవో ఎం సంపత్రావు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏడీఆర్ ఉమారెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ, పరిశ్రమల శాఖ జీఎం, ఉద్యానశాఖ జిల్లా అధికారి, వ్యవసాయశాఖ కమిషనరేట్ డీడీఏ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. వ్యవసాయ పరికరాలు, యంత్రా లు, పనిముట్ల సరఫరా కోసం కంపెనీలను ఆహ్వానిస్తూ ఈ కమిటీ ఇటీవల ఈ-ప్రొక్యూర్మెంట్ టెండర్ల ప్రక్రియ చేపట్టింది. ఈ నెల 1 నుంచి 21 వరకు టెండర్ల దాఖలుకు గడువు ఇచ్చింది. వివిధ రాష్ర్టాలకు చెందిన కంపెనీలు ఈ టెండర్లలో పాల్గొనగా 22న టెక్నికల్ బిడ్, 23న ప్రైస్ బిడ్ ఓపెన్ చేసిన అధికారులు 49 కంపెనీల టెండర్లను ఖరారు చేశారు. ఈ కంపెనీలు శుక్ర, శనివారం నర్సంపేటలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. 9 రాష్ర్టాల నుంచి పలు కంపెనీలు ముందుగానే తమ కంపెనీ ఉత్పత్తి చేసిన వ్యవసాయ పరికరాలు, యంత్రాలు, పనిముట్లను నర్సంపేటకు చేర్చాయి. ఈ ప్రదర్శన ఏర్పాట్లను గురువారం ఎమ్మెల్యే పెద్ది పరిశీలించారు. నర్సంపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి రైతులను ఈ వ్యవసాయ పరికరాలు, యంత్రాలు, పనిముట్ల ప్రదర్శనకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య, ఎమ్మెల్యే పెద్దితో పాటు పలువురు అధికారులు పాల్గొంటారు.