హనుమకొండచౌరస్తా, జూలై 4: గురుపౌర్ణమి, జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కేయూలో ప్రభుత్వ వైద్యులను మంగళవారం ఘనంగా సన్మానించారు. అంబేదర్ స్టడీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ ఎల్పీ రాజ్కుమార్, ఫార్మసీ విభాగం ప్రొఫెసర్ గాదె సమ్మయ్య, ప్రొఫెసర్ జనపరెడ్డి కృష్ణవేణి వైద్యులను సత్కరించారు. డాక్టర్ బోరగాల రాజమోహన్ అసోసియేట్ ప్రొఫెసర్గా, న్యూరో సర్జరీగా రోగులకు విశిష్ట సేవలు అందించారు. అలాగే, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మెడికల్ జాక్ తరఫున ఆయన పాల్గొన్నారు. అంతేకాకుండా కాకతీయ మెడికల్ కాలేజీ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్లో అధ్యక్షుడిగా, ఐఎంఏ ట్రెజరర్గా పని చేశారు. ఉత్తమ వైద్యుడిగా జిల్లాస్థాయి అవార్డు అందుకున్నారు. అంబేదర్ నేషనల్ ఫెలోషిప్ అవార్డు, సావిత్రీబాయి పూలే రాష్ట్రస్థాయి అవార్డు పొందారు. ప్రస్తుతం తెలంగాణ టీచింగ్ డాక్టర్స్ అసోసియేషన్ రీజినల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కోడం రామ్మోహన్ ఎంజీఎం దవాఖానలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్గా ఉత్తమ సేవలు అందించారు. వీరి సేవలను గుర్తించి శాలువాలు కప్పి బుద్ధుడు, అంబేద్కర్ ప్రతిమలు, జ్ఞాపికలతో కాకతీయ యూనివర్సిటీలోని కెమిస్ట్రీ లాబొరేటరీలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ గాదె సమ్మయ్య మాట్లాడుతూ వీరిద్దరూ మారుమూల ప్రాంతాల్లో మెడికల్ ఆఫీసర్లుగా ఎన్నో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారని, కాకతీయ యూనివర్సిటీలోని విద్యార్థులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి క్లినిక్స్ల్లో, ఎంజీఎంలో ఉచిత సేవలు అందించినందుకు సన్మానించినట్లు తెలిపారు. కేయూలో ప్రభుత్వ డాక్టర్లు ఇలాంటి సేవలను అందిస్తున్నందుకు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. వీరు జ్యోతీరావు పూలే, సావిత్రీబాయి ఫూలే, డాక్టర్ బీఆర్ అంబేదర్ను ఆదర్శంగా తీసుకొని ‘పే బ్యాక్ టు ద సొసైటీ’గా నిలిచారని కొనియాడారు.