కాశీబుగ్గ, జనవరి 11 : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు బుధవారం నాదరి ఎల్లో(గోల్డ్ కలర్) మిర్చి వచ్చింది. మార్కెట్ చరిత్రలోనే మొదటిసారి ఈ రంగు మిర్చి వచ్చినట్లు అధికారులు తెలిపారు. జనగామ జిల్లా తరిగొప్పుల గ్రామానికి చెందిన బుస్సా కుమారస్వామి 14 బస్తాల గోల్డ్ కలర్ మిర్చిని తీసుకువచ్చాడు.
ఉదయకృష్ణ కమర్షియల్ కార్పొరేషన్ అడ్తి ద్వారా ఓ వ్యాపారి క్వింటాల్కు రూ.40వేలతో కొనుగోలు చేస్తానని చెప్పాడు. కాగా, రైతు మిర్చిని క్వింటాల్కు రూ.50వేలకంటే తక్కువ ఇవ్వనని చెప్పడంతో వ్యాపారి వెనుతిరిగి పోయాడు. ఆ రైతు మార్కెట్కు తీసుకువచ్చిన మిర్చి బస్తాలను కోల్డు స్టోరేజీలో భద్రపరిచినట్లు అధికారులు తెలిపారు. మార్కెట్కు కొత్త రకం మిర్చి వచ్చినట్లు ప్రచారం కావడంతో అడ్తి, కరీదు వ్యాపారులు పెద్ద ఎత్తున వచ్చి నాదరి ఎల్లో రకం మిర్చిని తిలకించారు.