వరంగల్, జూలై 3 : వరంగల్ ప్రజల కొంగు బంగారమైన భద్రకాళీ అమ్మవారు శాకంబరీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. 15 రోజుల పాటు కనులపండువగా జరిగిన భద్రకాళీ శాకంబరీ నవరాత్రి ఉత్సవాలు సోమవారంతో పరిసమాప్తమయ్యాయి. శాకంబరీ అలంకరణ, గురుపౌర్ణమి నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రధాన అర్చకుడు భద్రకాళీ శేషు ఆధ్వర్యంలో ఉదయం 3 గంటలకు అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని వివిధ కూరగాయలతో శాకంబరీగా అలంకరించారు. ఉదయం 9.30 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. శాకంబరీ నవరాత్రుల చివరి రోజు భద్రకాళీని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. గురుపౌర్ణమి కావడంతో భద్రకాళీ ఆలయ ప్రాంగణంలోని సాయిబాబా దేవాలయానికి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
నాలుగు క్వింటాళ్ల కూరగాయలతో అలంకరణ
శాకంబరీ అలంకరణలో భాగంగా భద్రకాళీ అమ్మవారిని నాలుగు క్వింటాళ్ల వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. నగర ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. మేయర్ గుండు సుధారాణి-ప్రభాకర్ దంపతులు, పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ దంపతులతోపాటు చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్-రేవతి దంపతులు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ దంపతులు భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే, హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కృష్ణమూర్తి, దేవాదాయ శాఖ కమిషనర్ సతీమణి పద్మా అనిల్కుమార్, కార్పొరేటర్ అభినవ్భాస్కర్ కూడా అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. శాకంబరీ ఉత్సవాల నేపథ్యంలో భక్తులకు దాతల సహాయంతో ప్రసాద వితరణ చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఈవో శేషు భారతి పర్యవేక్షణలో విస్తృత ఏర్పాటు చేశారు.