ఏటూరునాగారం, వాజేడులో 3వ ప్రమాద హెచ్చరిక
మంగపేట మండలం బోర్నర్సాపురంలో కరకట్టకు గండి
కాళేశ్వరం, లక్ష్మీబరాజ్కు వరద ఉధృతి
85 గేట్లద్వారా 27,88 లక్షల క్యూసెక్కుల అవుట్ ఫ్లో
25 ఏండ్ల నాటి రికార్డు ప్రవాహం
పునరావాస కేంద్రాలకు తరలిన ప్రజలు
పర్యవేక్షించిన కలెక్టర్లు, ఐటీడీఏ పీవో
వరద పరిస్థితులను పరిశీలించిన ములుగు జడ్పీ చైర్మన్
జయశంకర్ జిల్లాలో 14,680 ఎకరాల పంట నష్టం
ఆలయాల్లో వరుణ జపం
గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. గతంలో ఎప్పుడూ లేనంతగా జూలై నెలలో వరద పోటెత్తింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో పడుతున్న వానలు తోడవడంతో గోదావరి పరవళ్లుతొక్కుతోంది. నది 25 ఏండ్ల (1986)నాటి రికార్డు ప్రవాహానికి చేరువలో ఉందని అధికారులు పేర్కొంటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద తీవ్ర రూపం దాల్చింది. లక్ష్మీ (మేడిగడ్డ) ప్రాజెక్టు 85 గేట్లు ఎత్తగా 27.88 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది. ఏటూరునాగారం మండలం రామన్నగూడెం, వాజేడు మండలంలోని పేరూరు వద్ద 3వ ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తున్నది. మంగపేట మండలం బోర్నర్సాపురం వద్ద కరకట్టకు గండిపడి నీరు పరిసర ప్రాంతాలకు చేరింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. వరదలకు జయశంకర్ జిల్లాలో 14,680 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారుల గణాంకాలు తెలియజేస్తున్నాయి. వరుణుడు శాంతిచాలని రెండు జిల్లాల్లోని ఆయాల్లో అర్చకులు వరుణజపం చేశారు.
జయశంకర్ భూపాలపల్లి/ ములుగు, జూలై 14 (నమస్తే తెలంగాణ) : వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు గోదావరి నదికి ఎగువ ప్రాంతాల్లో పడుతున్న వానలతో భారీగా వరద నీరు చేరడంతో గోదావరి నది జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్నది. కాళేశ్వరంలో మూడో ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తున్నది. త్రివేణి సంగమం వద్ద గోదావరి తీవ్ర రూపం దాల్చింది. 27.88 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహంతో లక్ష్మీ బరాజ్కు చేరుతున్నది. గోదావరిలో మధ్యాహ్నం 3 గంటల వరకు 27,88,050 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, బ్యారేజ్ 85 గేట్లు ఎత్తి 27,88,050 లక్షల క్యూసెక్కుల అవుట్ ఫ్లో ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
25 ఏండ్ల నాటి రికార్డు స్థాయిలో..
గోదావరి నది 25 ఏండ్ల నాటి రికార్డు ప్రవాహానికి చేరువలో ఉందని పలువురు అధికారులు పేర్కొంటున్నారు. 1986లో సుమారు 28 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చినట్లు చెప్తున్నారు. ప్రస్తుతం 27,88,050 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. గోదావరి నది పూర్తి ప్రవాహ సామర్థ్యం 28 లక్షల క్యూసెక్కుల వరకు ఉంటుందని, ఆ స్థాయికి చేరుకుని ప్రవాహించే సూచనలు ఉన్నాయంటున్నారు.
14,680 ఎకరాల్లో పంట నష్టం
భారీ వర్షాలకు జిల్లాలోని ఐదు మండలాల పరిధిలోని 30 గ్రామాల్లో వరద తీవ్ర ఉంది. 14,680 ఎకరాల పంట నష్టం వాటిల్లింది. ఇందులో 1500 ఎకరాల్లో వరి నారు, 13,180 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిన్నట్లు అధికారుల గణాంకాలు చెప్తున్నాయి. 64 జంతువులు మరణించాయి, 764 ఇండ్లు పాక్షికంగా, 42 ఇండ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. 21 చెరువులకు గండ్లు పడ్డాయి. 14 పంచాయతీరాజ్ రోడ్లు, 14 ఆర్అండ్బీ రోడ్లు దెబ్బతిన్నాయి. 20 విద్యుత్ లైన్లు, 27ఎల్టీ విద్యుత్తు లైన్లు దెబ్బతిన్నాయి. 20 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 2,250 మందికి పునరావాసం కల్పించారు.
ములుగు జిల్లాలో..
జిల్లాలోని నాలుగు మండలాల్లో గోదావరి నది గురువారం ఉగ్రరూపం దాల్చి ప్రవహించింది. పేరూరు, రామన్నగూడెం వద్ద 3వ ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి నది ప్రవాహం కొనసాగింది. బుధవారం సాయంత్రం నుంచి నది ప్రవాహం గంట గంటకు పెరిగి కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం సమ్మక్క బరాజ్ వద్ద గురువారం సాయంత్రం 6 గంటలకు 26,90,640 లక్షల క్యూసెక్కుల నీరురాగా 59 గేట్లను దాటుకుంటూ ప్రవహించింది. బుధవారం రాత్రి 9 గంటలకు 17,98,340 క్యూసెక్కుల నీరు ప్రవహించగా 24గంటల వ్యవధిలో గంట గంటకు 8,92,300 క్యూసెక్ల నీటి ప్రవాహం ఒకే రోజులో పెరిగింది. దీంతో ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం, వాజేడు మండలంలోని పేరూరు వద్ద గోదావరి నది 3వ ప్రమాద హెచ్చరికలను దాటి ప్రవహించింది. ఈ కారణంగా పలు గ్రామాలు జలమయం కాగా అధికారులు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మంగపేట మండలంలో గురువారం సాయంత్రం బోర్నర్సాపురం గ్రామం వద్ద ఉన్న కరకట్టకు గండి పడి భారీ ఎత్తున వరద నీరు గ్రామ పరిసర ప్రాంతాలకు చేరింది.
ముంపు ప్రాంతాల్లో కలెక్టర్, పీవో పర్యటన
గోదావరి వరదలతో పాటు భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఏటూరునాగారంలోనే బస చేసి ఐటీడీఏ పీవో అంకిత్తో కలిసి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించారు. గురువారం ఉదయం కన్నాయిగూడెం మండలంలో పర్యటించిన కలెక్టర్, పీవో వరద పరిస్థితులను తెలుసుకొని అధికారులను అప్రమత్తం చేశారు.