వరంగల్, మార్చి 27: భద్రకాళీ ఆలయానికి వచ్చే భక్తులు ఎండ, వర్షాల బారిన పడకుండా నీడ కల్పించేందుకు వీలుగా ఆలయ ప్రాంగణంలో జర్మన్ పెండల్స్ను ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి తన సొంత ఖర్చుతో వేయిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన జర్మన్ పెండల్స్ పనులకు అర్చకుల వేదమంత్రోచ్ఛరణల నడుమ భూమిపూజ చేశారు. శాశ్వత ప్రాతిపదికన సుమారు రూ.10 లక్షలతో ఈ పనులు చేయిస్తున్నారు. ఈ సందర్భంగా పోచంపల్లి మాట్లాడుతూ.. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం గణపతి ఆలయం నుంచి యాగశాల వరకు జర్మన్ పెండల్స్ వేయిస్తున్నట్లు తెలిపారు. 10 రోజుల్లో పనులు పూర్తి చేయిస్తామన్నారు. అనంతరం ఆయన భద్రకాళీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు, ఆలయ ప్రధాన అర్చకులు శేషు, తదితరులు పాల్గొన్నారు.
భద్రకాళీ ఆలయంలో వైభవంగా జరిగిన వసంత నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. తొమ్మిదో రోజు శుక్రవారం ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవ, నిత్యాహ్నికం అనంతరం లక్ష గులాబీ పూలతో పుష్పార్చన చేశారు. అనంతరం చండీ హవనం, మహాపూర్ణాహుతితో వసంత నవరాత్రి ఉత్సవాలు ముగిసినట్లు ఆలయ ఈవో సునీత తెలిపారు. శ్రీరామ నవమి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దర్శించుకోగా, రాత్రి 7 గంటలకు సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.