మొదటి మొక్కుల తల్లి గట్టమ్మ దేవాలయంపై రగడ నడుస్తున్నది. తమ తాత ముత్తాతల నుంచి తామే పూజారులమని నాయకపోడులు చెప్తుంటే.. కాదు, 1953 నుంచి తామే గట్టమ్మ పూజారులమని, హైకోర్టు సైతం తమకు ఆర్డర్ ఇచ్చిందని ముదిరాజ్లు అంటున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు తీవ్రస్థాయికి చేరింది. ఈ వివాదం గాలివానలా మారి సోమవారం గట్టమ్మ సాక్షిగా ఘర్షణకు దారి తీసింది.
– ములుగురూరల్, మార్చి 4
ములుగు గట్టమ్మ దేవాలయంపై పట్టు కోసం జాకారానికి చెందిన ముదిరాజ్లు, గ్రామస్తులు, ములుగు ఆదివాసీ నాయకపోడు పూజారుల మధ్య సోమవారం ఘర్షణ జరిగింది. ఆలయం వద్ద పూజల్లో ఉన్న నాయకపోడు మహిళలకు గాయాలయ్యాయి. విషయం తెలిసి డీఎస్పీ రవీందర్, ములుగు, పస్రా సీఐలు రంజిత్కుమార్, శంకర్, ములుగు, వెంకటాపూర్, పస్రా ఎస్సైలు వెంకటేశ్వర్, రాజు, మస్తాన్ అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుండగానే ఘర్షణ చోటు చేసుకోగా పోలీసులు చెదరగొట్టారు. అనంతరం ఇరువర్గాలవారు ఆలయ ఆవరణలో బైఠాయించారు.
70, 80 ఏళ్లుగా నాయకపోడులే గట్టమ్మ పూజారులుగా ఉన్నారని ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్, పూజారులు తెలిపారు. తమ తాత ముత్తాల నుంచి వారసత్వంగా ఆలయం వద్ద పూజారులుగా కొనసాగుతున్నామన్నారు. గతంలో ములుగు పరిధిలో కెనాల్ కింది భాగంలో చింతచెట్టు కింద ఉన్న బాల గట్టమ్మను 1960లో పూజారి కొత్త లక్ష్మయ్య, మరి కొందరు కలిసి ఎత్తు ప్రాంతమైన ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్టించారని చెప్పారు. 2000 సంవత్సరంలో కొందరు రాజకీయ లబ్ధికోసం ఈ భూములు జాకారం పరిధిలోకి వస్తాయని చెప్పి గొడవలు స్పష్టించారని చెప్పారు. 2015లో కోర్టు పూర్తి హక్కులు తమకేనని తీర్పు ఇచ్చిందని వెల్లడించారు.
1956లో జహీర్అహ్మద్ఖాన్ అనే అధికారి ఊరికొకరిని తీసుకొచ్చి జాకారాన్ని ఏర్పాటు చేశారని, 1954లో ములుగు పరిధిలో గట్టమ్మపల్లె అనే ఊరు ఉండేదని అది కాలిపోతే రోడ్డు వైపు వచ్చి ఇండ్లు కట్టుకున్నారని చెప్పారు. గట్టమ్మపల్లెకు అప్పటి ప్రాజెక్టు డైరెక్టర్ ప్రేమ్నాథ్మాథూర్సాబ్ పేరుతో ప్రేమ్నగర్ అని పేరు పెట్టినట్లు వివరించారు. 1956లో వచ్చిన జాకారం గ్రామస్తులు ఎలా పూజారులవుతారని ప్రశ్నించారు. నాయకపోడులపై దాడిని ఖండిస్తున్నట్లు పోడ్దెబ్బ వ్యవస్థాపక అధ్యక్షుడు దబ్బా సుధాకర్, పొలిట్ బ్యూరో మెంబర్ బొల్లెం సారన్న, జాతీయ కో ఆర్డినేటర్ నెమలి నర్సయ్య మాదిగ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ముదిరాజ్లపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
గట్టమ్మ ఆలయం హైకోర్టు ఆర్డర్ ప్రకారం తమకే చెందుతుందని ముదిరాజ్ పూజారుల పరస్పర సహకార సంఘం అధ్యక్షుడు ఈర్ల చేరాలు, సభ్యులు వెల్లడించారు. గతంలో గట్టమ్మ వద్ద గుడి, గద్దెలను కట్టించింది కూడా తామేనని తెలిపారు. 1953 నుంచి తామే గట్టమ్మ పూజారులమన్నారు. నాయకపోడులు అడ్డు వచ్చి ఆటంకాలు సృష్టిస్తూ తమపై దొంగ కేసులు పెట్టారన్నారు. 2016లో తమకు కోర్టు ఆర్డర్ వచ్చిందన్నారు. అధికారుల నిర్లక్ష్యం, తమ నిర్లక్ష్యం వల్ల ఆలస్యమైందని వివరించారు. కోర్టు ఆర్డర్ ప్రకారం ప్రస్తుతం తాము గట్టమ్మ ఆలయానికి వచ్చినట్లు తెలిపారు. ‘మా గట్టమ్మను మేమే తీసుకుంటా’మని అధికారులందరికీ పిటిషన్లు ఇచ్చి నా వారు స్పందించడం లేదని ఆరోపించారు.
జాకారానికి చెందిన ముదిరాజ్ కులస్తులు, గ్రామస్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్ తెలిపారు. ఆదివాసీ నాయకపోడులపై దాడిచేశారని గట్టమ్మ పూజారి కొత్త సదయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈర్ల చేరాలు, రమేశ్, రఘు, మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.