గణపురం, ఫిబ్రవరి 17 : ప్రభుత్వ భూమి కబ్జాపై గణపురం రెవెన్యూ అధికారులు కదిలారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు పాతిన రాళ్లను తొలగించారు. మండలంలోని గాంధీనగర్-మైలారం గ్రామాల మధ్య 204 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా చేసి గుంటకు రూ. 14 లక్షల వరకు విక్రయిస్తున్న విషయమై శనివారం ‘దర్జాగా కబ్జా’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు.
ఆర్ఐ రహీంపాషా ఆధ్వర్యంలో ట్రాక్టర్ డోజర్తో పాతిన రాళ్లను తీసేశారు. ఈ సందర్భంగా ఆర్ఐ మాట్లాడుతూ ప్రభుత్వ భూమిని ఎవరైనా అమ్మినా, కొన్నా నేరమని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు సరైన విచారణ చేయకుండా ప్లాట్లు కొనుగోలు చేస్తే నష్టపోతారని ఆర్ఐ తెలిపారు.