తాడ్వాయి, ఫిబ్రవరి 19 : మహా జాతరకు వచ్చే వీఐపీలు తమ వాహనాలను ములుగులో పార్కింగ్ చేసి ఆర్టీసీ బస్సులో మేడారానికి చేరుకోవాలని రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. సోమవారం మంత్రి పొంగులేటి మేడారం పర్యటనకు రాగా మంత్రి సీతక్క, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరీష్ ఘన స్వాగతం పలికారు. మంత్రులకు పూజారులు, దేవాదాయ శాఖ అధికారులు స్వాగతం పలికి తల్లుల గద్దెల వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పొంగులేటి ఎత్తు బెల్లం సమర్పించి మొక్కులు చెల్లించారు. గద్దెల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చొరవతో స్థానిక మంత్రి సీతక్క ఆధ్వర్యంలో జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నా తన నియోజకవర్గంలో జరిగే జాతర అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తూ భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు సీతక్క ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. దర్శనానికి రెండు కోట్ల మంది భక్తులు వస్తారనే అంచనా ఉందని, అందుకు తగినట్లు ఏర్పాట్లు చేశామన్నారు.
జీరో టికెట్పై ఇప్పటికే రాష్ట్రంలో 17 కోట్ల మంది మహిళలు బస్సు ప్రయాణం చేశారని మంత్రి తెలిపారు. జాతర నిర్వహణకు 16వేల మంది అధికారులు పనిచేస్తున్నారని, 4వేల మంది కార్మికులతో పారిశుధ్య పనులు చేపడుతున్నట్లు చెప్పారు. మేడారానికి అనుసంధానం ఉండే 270 కిలోమీటర్ల రోడ్లను నిర్మించినట్లు తెలిపారు. వీఐపీలు ములుగులో వాహనాలు పార్కింగ్ చేసి ఆర్టీసీ బస్సులో మేడారానికి రావడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయన్నారు. వీఐపీలు సైతం సహకరించాలని కోరారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు రెండు నెలల నుంచి శ్రమించి భక్తులకు సౌకర్యాలు కల్పించారన్నారు. గత జాతరలో పనిచేసిన ఐదుగురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సేవలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. 1996లోనే సమ్మక్క-సారలమ్మ జాతరకు రాష్ట్ర పండుగగా గుర్తింపు వచ్చిందని, కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించాల్సి ఉందన్నారు. జాతర పూర్తయిన తర్వాత ఖర్చులన్నీ ప్రజల ముందు పెడతాం, మిగిలిన డబ్బుతో జాతరలో శాశ్వత నిర్మాణాలు చేపడుతామన్నారు.
గద్దెల ప్రాంగణంలో నిర్మించిన మంచెను సమాచార శాఖ కమిషనర్ హన్మంతరావుతో కలిసి మంత్రులు పొంగులేటి, సీతక్క ప్రారంభించారు. కవరేజ్లో మీడియా ప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించిన సీతక్క నూతన మీడియా పాయింట్ నిర్మించాలని కలెక్టర్కు సూచించడంతో మంచెను ఏర్పాటు చేశారు.