హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 9 : ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం మధ్యాహ్నం ‘మహాలక్ష్మి’ పథకాన్ని ప్రారంభించగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అమలులోకి వచ్చింది. ప్రభుత్వం, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు అన్ని డిపోల్లో ఇందుకోసం ఏర్పాట్లు చేయగా రాష్ట్రంలో ఎక్కడికైనా ఆర్టీసీ బస్సులో టికెట్ లేకుండా ప్రయాణించే వెసులుబాటు కల్పించింది. ఈమేరకు ఎక్కడికక్కడ కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, భవేశ్మిశ్రా, ఇలా త్రిపాఠి, శివలింగయ్య, శశాంక, హనుమకొండ బస్స్టేషన్లో ఆర్టీసీ ఆర్ఎం శ్రీలత, డిపో మేనేజర్లతో కలిసి జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించగా మహిళలు, విద్యార్థులు జీరో టికెట్పై ప్రయాణించి సంతోషం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా తొలిరోజు ఆడబిడ్డలతో ఆర్టీసీ బస్స్టేషన్లన్నీ కిటకిటలాడాయి. పథకాన్ని పక్కాగా అమలుచేసేందుకు గాను ప్రభుత్వం ఆర్టీసీ సిబ్బందికి ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది.
కొత్తగా కొలువుదీరిన రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని శనివారం అమలులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించగా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడినుంచి ఎక్కడి వరకైనా సరే.. ఆర్టీసీ బస్సు ఎక్కితే చాలు టికెట్ తీసుకోకుండా ప్రయాణించే వెసులుబాటు కల్పించింది. అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ కల్పిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకం హామీని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పుట్టిన రోజును పురస్కరించుకుని శనివారం మధ్యాహ్నం లాంఛనంగా ప్రారంభించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఆర్టీసీ ఉన్నతాధికారులు పూర్తి చేశారు. పథకాన్ని అమలు చేసేందుకు వీలుగా ఆర్టీసీ సిబ్బందికి ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేశారు. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్ సర్వీసుల్లో మహిళలు, బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు ఉచితంగా ప్రయాణించవచ్చని పేరొంది.
పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో..
పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని వెల్లడించింది. వరంగల్ రీజియన్ పరిధిలో నడిచే పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ల్లోనూ ఉచిత ప్రయాణం వర్తిస్తుందని ఆర్టీసీ ఆర్ఎం జె.శ్రీలత తెలిపారు. మహిళలతో పాటు బాలికలు, విద్యార్థినులు, థర్డ్జెండర్లు కూడా ఉచితంగా ప్రయాణించవచ్చని ఆమె పేర్కొన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ మార్గదర్శకాలను ఆమె వివరించారు. ఉచిత ప్రయాణంతో బస్సుల్లో రద్దీ పెరిగే అవకాశమున్నందున, బస్స్టేషన్ల నిర్వహణపై దృష్టి సారించాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఉచిత ప్రయాణం అమలులో సిబ్బంది క్రమశిక్షణతో వ్యవహరించాలని, ఓపిక, సహనంతో విధులు నిర్వర్తించాలని ఆర్ఎం సూచించారు. ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలందరూ ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని ఆర్ఎం శ్రీలత కోరారు.
తెలంగాణ పొలిమేర వరకు..
ఈ ఫ్రీ జర్నీ ఎన్ని కిలోమీటర్లు అన్న సందేహం అవసరం లేదు. ఎందుకంటే ఎన్ని కిలోమీటర్లు అయినా ఉచితమే. తెలంగాణ పొలిమేరల్లో ఉన్నంతవరకు ఏ మహిళకైనా టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ట్రాన్స్జెండర్లకు కూడా అవసరం లేదని తేల్చేశారు. ఏపీకి వెళ్లే తెలంగాణ బస్సుల్లో ఎక్కే మహిళలకు టికెట్ ఉచితమే, కాకుంటే తెలంగాణ రాష్ట్ర పొలిమేరల వరకు మాత్రమే. ఆ తర్వాత టికెట్ తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.
కండక్టర్లకు సూచనలు..
ఈ పథకం అమలు వేళ.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ సిబ్బందికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరగడం వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించడంతో పాటు ఎలాంటి విసుగును ప్రదర్శించకుండా బాధ్యతతో వ్యవహరించాలని ఆర్టీసీ ఉద్యోగులకు హితబోధ చేశారు. అంతేకాదు మొదటివారం, పది రోజుల వరకు కూడా ఎలాంటి ధ్రువీకరణ పత్రాలను అడగాల్సిన అవసరం లేదని కండక్టర్లకు సూచించారు. ఉచితంగా తీసుకెళ్తున్నాం కాబట్టి సిబ్బంది నోటికి వచ్చినట్లుగా మాట్లాడొద్దని పదేపదే సూచించినట్లు పేర్కొన్నారు.
45శాతం మంది మహిళలే ప్రయాణం..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 9 ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. ఇందులో 909 బస్సుల్లో పల్లెవెలుగు-453, మినీ పల్లెవెలుగు-13, సిటీ ఆర్డినరీ-57, ఎక్స్ప్రెస్లు-123, ఇతర బస్సులు-263 ఉండగా ప్రతిరోజు సుమారు 3 లక్షల కిలోమీటర్ల వరకు ఆయా డిపోల పరిధిలో తిరుగుతుండగా ప్రతిరోజూ ఆర్టీసీకి సుమారు కోటిన్నర వరకు ఆదాయం వస్తున్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. నిత్యం 2.80లక్షల మంది ప్రయాణిస్తుండగా అందులో 45శాతం మహిళలే ఉన్నారు. సుమారు 1.26 లక్షల మంది బాలికలు, మహిళలు ప్రయాణిస్తున్నారు. ఇందులో పల్లెవెలుగు, ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణించే మహిళలు సుమారు 95వేల మంది ఉంటారు. వీరి ద్వారా రోజుకు రూ.47 లక్షల వరకు ఆదాయం ఆర్టీసీకి లభిస్తుంది. ఇక నుంచి ఈ మొత్తం మహిళా ప్రయాణికులకు మిగలనుంది. వరంగల్ రీజియన్ పరిధిలో రోజుకు సగటున రూ.1.40కోట్ల ఆదాయం సమకూరుతుంది. ఉచిత ప్రయాణం వల్ల రోజుకు సుమారు రూ.47 లక్షల ఆదాయం ఆర్టీసీ కోల్పోనున్నది. ఈ మొత్తాన్ని రీయింబర్స్మెంట్ రూపంలో ప్రభుత్వం తిరిగి ఆర్టీసీకి చెల్లించనున్నది. ఉచిత ప్రయాణం వల్ల విద్యార్థినులు, యువతులు, మహిళలు ఉద్యోగులు, మహిళా కూలీలకు మేలు కలుగనుంది. జీరో టికెట్ వల్ల మహిళల బస్సు ప్రయాణాలు పెరిగే అవకాశం ఉన్నందున అవసరానికి సరిపడా బస్సులు పెంచాలని ప్రజలు కోరుతున్నారు.
వేములవాడకు వెళ్తున్నా..
మాది స్టేషన్ఘన్పూర్. మేం అందరం కలిసి వేములవాడకు మొక్కు చెల్లించుకునేందుకు వెళ్తున్నాం. బస్సులో టికెట్ లేకుండా ఫ్రీగా వెళ్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. బస్సులో ఎక్కడికైనా టికెట్ లేకుండా వెళ్లేందుకు ప్రభుత్వం బాగా చేసింది. పైసలు కూడా మిగులుతాయి.
– ఎన్.పుష్ప, ప్రయాణికురాలు
మధ్యతరగతికి మేలు..
మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. నిత్యం ఆటోలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. దీని వల్ల ఆర్థికంగా కొంత మేలు జరుగుతుంది. విద్యార్థ్థినులకు, మహిళా ఉద్యోగులకు, ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసే మధ్యతరగతివారికి ఎంతో మేలు. స్కీం మధ్యలోనే నిలిపివేయకుండా నిరంతరం కొనసాగించాలి.
– శ్రావణి, మెడిసిన్ విద్యార్థిని
ఖర్చులు మిగులుతాయి..
బస్సుల్లో ఉచిత ప్రయాణం నిర్ణయం వల్ల ఖర్చులు మిగులుతాయి. అవసరం నిమిత్తం పట్టణాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు మేలు జరుగుతుంది. మేం మొత్తం 1100 మంది ఉంటాం. మాకు ఉచితంగా బస్సుల్లో ప్రయాణాన్ని కల్పిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
– స్నేహ, అశ్విని, ట్రాన్స్జెండర్లు
మహిళలు ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకోవాలి..
మహిళలకు ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నది. పేద మహిళలకు ఎంతో ఉపయోగపడుతుంది. మహిళలకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏదైనా గుర్తింపుకార్డు చూపించాల్సి ఉంటుంది. పల్లెవెలుగు, ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.
– శ్రీలత, ఆర్టీసీ ఆర్ఎం