రాష్ట్రంలోని ప్రజలకు కంటి సమస్యలను దూరం చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని ఇటీవల ఆదేశాల జారీ చేశారు. తొలి విడుత 2018 ఆగస్టు 15న ప్రారంభించగా 3,24,644 మందికి అత్యాధునిక యంత్రాలతో వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించారు. 220 గ్రామాలు, రెండు వార్డుల్లో శిబిరాలు ఏర్పాటు చేసి 84,968 మందికి రాష్ట్ర ప్రభుత్వం కళ్లద్దాలు, మందులు పంపిణీ చేసింది. కాగా, మారుతున్న జీవనశైలితో ప్రతి ఏటా అనేకమంది కంటి సమస్యల బారిన పడుతున్న నేపథ్యంలో రెండో విడుత ‘కంటి వెలుగు’ను 2023 జనవరి 18 నుంచి ప్రారంభించాలని వైద్యాధికారులను ఆదేశించింది. దీంతో వైద్యారోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర సర్కారు మరోమారు కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపడుతుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్, నవంబర్ 23(నమస్తేతెలంగాణ) : రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణకు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. గ్రామాల్లో కంటి పరీక్షల కోసం శిబిరాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రత్యే క బృందాల ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. తొలి విడుతలో ఉపయోగించిన యం త్రాలను మళ్లీ సిద్ధం చేసే పనిలో పడ్డారు. నేత్ర సమస్యలను పరిష్కరించేందుకు జనవరి 18 నుంచి రెం డో విడుత కంటి వెలుగు నిర్వహించాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది. ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. దీంతో రెండో విడుతను జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తం అవుతున్నారు. తొలి విడుత కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణ రికార్డులను పరిశీలిస్తున్నారు. 2018 ఆగస్టు 15న రాష్ట్ర ప్రభుత్వం తొలివిడుత కార్యక్రమం ప్రారంభించింది.
2019 మార్చి 31వరకు కార్యక్రమం కొనసాగింది. జిల్లాలో 220 గ్రామాలు, రెండు వార్డుల్లో వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యే క బృందాలు శిబిరాలు నిర్వహించాయి. కంటి జబ్బులతో బాదపడుతున్న 3,24,644 మందికి కంటి పరీక్షలు జరిపారు. వారిలో పురుషులు 1,48,947, మహిళలు 1,75,678, ట్రాన్స్జెండర్లు 19 మంది ఉన్నారు. వీరిలో 52,718 మందికి రీడింగ్ గ్లాసెస్ను వైద్య అధికారులు అందజేశారు. గ్లాసెస్ పొందిన వారిలో నలభై ఏళ్లవయసులోపు లబ్ధిదారులు 9,267 మంది, నలభై ఏళ్ల వయసు పైబడిన వారు 43,451 మంది ఉన్నారు. 44,122 మందికి కళ్లద్దాలు అవసరమని అధికారులు గుర్తించారు. 32,250 మందికి పంపిణీ చేశారు. రెఫరల్స్ కోసం 25,072 మందిని గుర్తించారు. అవసరమైతే మందులనూ అందించారు. ఉచితంగా పరీక్షలు జరిపి మందులతో పాటు కళ్లద్దాలను అందజేయడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. కంటి జబ్బులను దూరం చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
రెండో విడుతకు సన్నాహాలు..
నేత్ర సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం జనవరి 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించేందుకు రెడీ అవుతున్నది. సక్సెస్ కోసం సన్నద్ధం కావాలనే ఆదేశాలతో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నారు. తొలి విడుతలో శిబిరాల నిర్వహణకు జిల్లాలో ప్రత్యేకంగా ఎన్ని బృందాలు పనిచేశాయి.. ఒక్కో బృందంలో ఎంత మంది, వారి లో ఎవరెవరు ఉన్నారు.. ఒక్కోరోజు ఒక బృందం ఎంత మందికి కంటి పరీక్షలు చేసింది.. కంటి పరీక్షల కోసం స్పెషల్ టీమ్లు ఉపయోగించిన యంత్రాలేవి అనే వివరాలను పరిశీలిస్తున్నారు. కంటి పరీక్షల నిర్వహణకు ఆ బృందాలు వాడిన యంత్రాలను రెండో విడుత కార్యక్రమంలో ఉపయోగించేందుకు బయటకు తీస్తున్నారు. శిబిరాలు నిర్వహించాల్సిన గ్రామా లు, వార్డులు, డివిజన్లను గుర్తిస్తున్నారు. ఎంతమందికి కంటి పరీక్షలు జరపాల్సి ఉందనే సమాచారం కూడా సేకరిస్తున్నారు.
రెండో విడుత కోసం యంత్రాలను సిద్ధం చేస్తున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ చెప్పారు. తొలివిడుతలో శుక్లా లు, దృష్టి లోపాలు, నీటి కాసులు, డయాబెటిక్ రెటీనోపతి, కార్నియల్పై తెల్లని పొర తదితర కారణాల ను ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం వీటితో పాటు బాల్యంలో అంధత్వం, నెలలు నిండకుండా పుట్టిన శిశువుల్లో రెటీనోపతి, చూపు మందగించడం, కార్నియల్ సమస్యలు వంటివి ప్రజలను వేధిస్తున్నట్లు భావిస్తున్నది. వీటన్నింటి పరిష్కారానికి రెండో విడు త కార్యక్రమాన్ని కొన్ని నెలల పాటు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నది. కంటి సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో ‘కేసీఆర్ కంటి వెలుగు కేంద్రాల’ను శాశ్వత ప్రాతిపదికన నెలకొల్పాలని తాజాగా సర్కారు నిర్ణయించింది. జిల్లా, ప్రాంతీయ దవాఖానలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయబోతున్నది. వీటిల్లో నేత్ర వైద్యం, పరీక్షలు నిత్యం అందుబాటులో ఉండే లా ప్రణాళికలు రూపొందించాలని వైద్య, ఆరోగ్యశాఖను ఆదేశించినట్లు తెలిసింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.