హసన్పర్తి, మే 22 : రోడ్డు ప్రమాదంలో అన్నాతమ్ముడు దుర్మరణం చెందిన ఘటన మండలంలోని అనంతసాగర్ క్రాస్ రోడ్డు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగింది. ఎస్సై విజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామానికి చెందిన ఇప్పలపల్లి మనోహర్కు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు శివరామకృష్ట (25), చిన్నకుమారుడు హరికృష్ణ (23). మనోహర్ బట్టల వ్యా పారం చేస్తూ ఇద్దరు కుమారులను పెద్ద చదువులు చదివించి ప్రయోజకులను చేశాడు. శివరామకృష్ణకు రైల్వేశాఖలో ఉద్యోగం రావడంతో మౌలాలీ (సికింద్రాబాద్)లో శిక్షణ పొందుతున్నాడు. హరికృష్ణ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాప్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు.
శివరామకృష్ణకు పోస్టల్ శాఖలో ఉద్యోగం వచ్చిందని చెప్పడం కోసం ఆదివారం ఇంటికి వచ్చారు. సోమవారం డ్యూటీకి వెళ్లేందుకు తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో శివరామకృష్ణ, హరికృష్ణ బైక్పై హైదరాబాద్కు వెళ్తున్న క్రమం లో అనంతసాగర్ క్రాస్ రోడ్డు వద్ద గుర్తు ్తతెలియని వాహ నం ఢీకొంది. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న కుటుంబ స భ్యులు ఘటనా స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రయోజకులైన తనయులు ఇలా మృతి చెందడంతో మాకెవరు దిక్కూ అంటూ రోదించారు. ఘటనాస్థలిని ఎస్సై విజమ్కుమార్, ఎల్కతుర్తి సీఐ ప్రవీణ్కుమార్ పరిశీలించారు. మృతుల తండ్రి మనోహర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. దుర్ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని తాత మనువరాలు మృతి
రేగొండ : పరకాల-భూపాలపల్లి హైవేపై భాగిర్థిపేట వద్ద ఘటన ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో తాత, మనువరాలు మృతి చెందారు. స్థానిక ఎస్సై శ్రీకాంత్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సీతారాంపురం గ్రామానికి చేందిన నరాల చిన్న సమ్మయ్య(60) తన మనువరాలు అక్షిత(14)ను తీసుకుని టీవీఎస్ చాంప్పై పోచంపల్లిలో ఉంటున్న చిన్నకూతురు ఇంటికి సోమవారం ఉదయం బయలు దేరారు. రేగొండ మండలం భాగిర్ధిపేట క్రాస్ వద్ద వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు వెనుక నుంచి టీవీఎస్ చాంప్ను ఢీకొంది. ఈ ఘటనలో సమ్మయ్య, అక్షిత అక్కడిక్కడే మృతి చెందారు. పోచంపల్లిలో ఉంటున్న సమ్మయ్య చిన్నకూతురు బిడ్డ లక్షిత వేసవి సెలవులు కావడంతో అమ్మమ్మ ఊరైన సీతారాంపురం గ్రామానికి వారం క్రితం వచ్చింది. ఇంటికి వెళ్తానని అక్షిత చెప్పడంతో ఆమెను తాత సమ్మయ్య తీసుకెళ్తున్న క్రమంలో బస్సు ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
న్యాయం చేయాలని ఆందోళన
బస్సు ఢీకొన్న ఘటనలో మృతి చెందిన సమ్మయ్య, అక్షిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ మృతుల కుటుంబ సభ్యులు రేగొండ మండల కేంద్రంలోని పరకాల-భూపాలపల్లి హైవేపై ఆందోళనకు దిగారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ను కఠినంగా శిక్షించాలని రాస్తారోకో చేశారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న చిట్యాల సీఐ వేణుచందర్, ఎస్సై శ్రీకాంత్రెడ్డి ఆందోళనకారుల వద్దకొచ్చి మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వపరంగా న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో అందోళన విరమించారు.