భూపాలపల్లి, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : ఒకరిపై దాడి చేసిన సంఘటనలో శుక్రవారం నలుగురిపై హత్యాయత్నం కేసు నమోదైంది. భూపాలపల్లి సీఐ రాజిరెడ్డి కథనం ప్రకారం.. భద్రాది కొత్తగూడెం జిల్లా విద్యానగర్కాలనీ చుంచుపల్లికి చెందిన కుక్కమూడి సంపత్ ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తున్నాడు. ఇతడికి జిల్లా కేంద్రంలో ఇల్లు ఉంది. ఈ ఇంటి విషయమై సంపత్ భార్య రమాదేవి ఆడపడుచు దోర్నాల సుగుణ, దోర్నాల సారయ్యకు గొడవ జరుగుతున్నది.
ఫిర్యాదుదారు భర్త కోర్టుకు వెళ్లగా వివాదం కోర్టులో పెండింగ్లో ఉంది. దోర్నాల సారయ్య, దోర్నాల సుగుణ, దోర్నాల రాజేందర్, అంబాల చంద్రమౌళి ఎవరినో ఇంటిలో ఉంచుతున్నారని తెలిసి గురువారం రాత్రి ఫిర్యాదుదారు ఆమె భర్త సంపత్ వచ్చి కేసు కోర్టులో ఉందని, ఇంట్లో ఎవరూ ఉండొద్దని చెప్పారు. దీంతో నిందితులు సంపత్పై దాడి చేసి కొట్టగా, దోర్నాల సారయ్య కొబ్బరి బొండాల కత్తి తీసుకొచ్చి దాడిచేసి నరికి చంపే ప్రయత్నం చేశాడని బాధితుడి భార్య రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా నలుగురు నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.