హసన్పర్తి, మార్చి 31: ప్రతి డివిజన్ను అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 55 డివిజన్ భీమారంలో రూ. 50 లక్షల వ్యయంతో చేపట్టిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి బిషప్ ఉడుముల బాల, కార్పొరేటర్ జక్కుల రజిత-వెంకటేశ్వర్లతో కలిసి అరూరి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ప్రతి సామాజిక వర్గానికి కమ్యూనిటీ హాల్ మంజూరు చేశామన్నారు. అన్ని కులాల వారిని ఆర్థికంగా ఎదిగేలా చేయడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. రాష్ట్రంలోనే వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలుపడమే తమ లక్ష్యమన్నారు. అలాగే, అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. అనంతరం భీమారానికి చెందిన వలుస శివకు రూ. 1.50 లక్షల విలువైన సీఎంఆర్ఎస్ చెక్కును ఎమ్మెల్యే రమేశ్ లబ్ధిదారు ఇంటికెళ్లి అందజేశారు. ఇదే గ్రామానికి చెందిన గోరబోయిన పృథ్వీ, అటికం కొమురయ్య, బేతెల్లి అంకూస్ కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు అటికం రవీందర్గౌడ్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు సంగాల విక్టర్బాబు, ప్రధాన కార్యదర్శి నాయకపు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు రాయికంటి సుధాకర్, ఎర్రగట్టు ఆలయ చైర్మన్ చింతల లక్ష్మణ్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు ఏ సురేశ్, యూత్ అధ్యక్షుడు సాయి, గాజాల గోవర్ధన్ పాల్గొన్నారు.
నయీంనగర్: పేద ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయనిధి భరోసా కల్పిస్తున్నదని(సీఎంఆర్ఎఫ్) ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. హనుమకొండ ప్రశాంత్నగర్లోని తన నివాసంలో ఐనవోలు మండలం కక్కిరాలపల్లి, ఒంటిమామిడిపల్లి గ్రామాలకు చెందిన కాతా నాగయ్య, పెండ్లి జెన్నయ్యకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎల్వోసీని అందించారు. నాగయ్యకు రూ. 1.50 లక్షలు, జెన్నయ్యకు రూ. లక్ష మంజూరైనట్లు అరూరి తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోలెపల్లి శంకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, ఎంపీటీసీలు దామెర అనూష, రాజు, రమేశ్, సర్పంచ్ కంజర్ల రమేశ్, నాయకులు రాఘవులు, పార్టీ గ్రామ అధ్యక్షుడు సంపత్, యాకయ్య పాల్గొన్నారు.