డోర్నకల్ , జూలై 4 : కాంగ్రెస్ మాయ మాటలను ఎవరూ నమ్మరని మాజీ ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయక్ అన్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ శివారులోని మున్నేరు వాగు పక్కన నిర్మించిన గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకకు హాజరై, రూ. 57,524 విరాళంగా అందజేశారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం గొల్లచర్లలోని ఫంక్షన్లో హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు బీఆర్ఎస్, కేసీఆర్పై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేవలం 4.17 లక్షల కోట్ల అప్పు చేస్తే, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాయ మాటలకు, దొంగ హామీలకు ప్రజలు మోసపోయారన్నారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నారని, అలవి కాని వాగ్ధానాలు చేసి రెండున్నరేండ్లయినా నెరవేర్చలేదన్నారు. రైతులకు రుణమాఫీ, మహిళలకు తులం బంగారం, రూ. 2500, నిరుద్యోగ భృతి, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. రేవంత్రెడ్డి ఐదు సార్లు రైతు భరోసా ఎగ్గొట్టారన్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో 73 లక్షల రైతులకు రూ. 72 వేల కోట్ల రైతుబంధు అందజేసినట్లు తెలిపారు. హైదరాబాద్లో ఎక్కడ ప్రభుత్వం భూమి ఉందని వెతికి కబ్జా చేయాలని సీఎం రేవంత్రెడ్డి చూస్తున్నాన్నారు. దగా మాటలు మాట్లాడకుండా ప్రజలకిచ్చిన హమీలు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని రెడ్యా డిమాండ్ చేశారు. సమావేశంలో మహబూబాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కత్తెరశాల విద్యాసాగర్, మాజీ ఎంపీపీ ధరంసోత్ బాలూనాయక్, పీఏసీఎస్ చైర్మన్ చేరెడ్డి భిక్షంరెడ్డి, సర్పంచ్ రాయల వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ బానోత్ పాండునాయక్, నాయకులు కొత్త వీరన్న, కాలా యశోధర్ జైన్, కొత్త రాంబాబు, పచ్చిపాల మల్లేశం, కాడెం బాబు, ఇంజం కృష్ణయ్య, మారబోయిన రాంభద్రం, కొండేటి హేమ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.